టీడీపీది కార్మిక వ్యతిరేక విధానం

3 Sep, 2015 03:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా చేపట్టిన బంద్‌పై బుధవారం శాసనమండలిలో చర్చకు అనుమతించకపోవడంపై ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టాయి. అధికార టీడీపీది కార్మిక వ్యతిరేక విధానమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఐ, కాంగ్రెస్, పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్)లు విమర్శించాయి. బుధవారం మండలి సమావేశాలు ప్రారంభం కాగానే బంద్‌పై చర్చకు అనుమతించాలని కోరుతూ సీపీఐ, పీడీఎఫ్ సభ్యులు చైర్మన్ చక్రపాణికి వాయిదా తీర్మానాలు అందజేయగా, ఆయన తిరస్కరించారు.

చర్చకు అనుమతించాలంటే మరో విధానంలో సభ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఇదే సమయంలో తక్షణమే బంద్‌పై చర్చను చేపట్టి, కార్మికులకు సంఘీభావంగా సభలో తీర్మానం చేయాలంటూ వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్ పార్టీ సభ్యులు డిమాండ్ చేశారు. ఇంతలో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి జోక్యం చేసుకుంటూ దీనిపై వేరే సందర్భంలో చర్చకు సిద్ధమేనని ప్రకటించారు. ఆ తర్వాత కూడా చర్చకు పట్టుబట్టినప్పటికీ ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రాకపోవడంతో వైఎస్సార్‌సీపీ, సీపీఐ, కాంగ్రెస్, పీడీఎఫ్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
 
ప్రభుత్వ తీరు దారుణం: ప్రతిపక్ష సభ్యులు
బంద్‌లో ఉన్న కార్మికులకు సంఘీభావంగా సభలో చర్చిద్దామంటే ప్రభుత్వం ముందుకు రాకపోవడం దారుణమని సీపీఐ సభ్యుడు పి.జె.చంద్రశేఖర్, వైఎస్సార్‌సీపీ  పక్షనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. మండలి నుంచి వాకౌట్ చేసిన అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. పీడీఎఫ్ పక్ష నేత బాలసుబ్రమణ్యం, కాంగ్రెస్ సభ్యుడు చెంగల్రాయుడు కార్మికులపై ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు.

>
మరిన్ని వార్తలు