పార్వతీపురం: సినీ నటుడు పవన్ కల్యాణ్ను, ఆయన స్థాపించిన జనసేన పార్టీని ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ ప్రారంభించిన జనసేన పార్టీ మూడు గంటల సినిమా లాంటిది మాత్రమేనని అవహేళన చేశారు. శనివారం విజయనగరం జిల్లా పార్వతీపురంలో మీడియాతో మాట్లాడుతూ శత్రుచర్ల ఈ వ్యాఖ్యలు చేశారు.
'పవన్ కల్యాణ్ సినిమాలు ఏవిధంగా మూడుగంటల పాటు చూడడానికి బాగా ఉంటాయో.. ఆయన స్థాపించిన జనసేన పార్టీ కూడా అంతే!' అంటూ శత్రుచర్ల వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అంతటితో ఆగకుండా జనసేన పార్టీ ఎంతోకాలం నిలవదని జోస్యం చెప్పారు.
అటు సీఎం చంద్రబాబును ఉద్దేశించి కూడా శత్రుచర్ల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల విజయనగరం జిల్లా జెడ్పీ సమావేశానికి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గైర్హాజరవ్వడంపై ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని ప్రస్తావిస్తూ.. 'చంద్రబాబు నాయుడి కోపం టీ కప్పులో తుఫాను లాంటిది' అని అన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రిపదవుల అంశంపై స్పందిస్తూ.. 'భార్యాభర్తలు కలవడానికే టైమ్ పడుతుంది. టీడీపీ సీనియర్ నాయకులు, కొత్తగా పార్టీలో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేలతో కలిసిపోవడానికి కూడా సమయం పడుతుంది. అంతవరకూ మనస్పర్థలు తప్పవు' అని చెప్పారు. శత్రుచర్ల వ్యాఖ్యలపై జనసేన పార్టీ స్పందించాల్సిఉంది.