గబ్బర్‌సింగ్‌లా బయలుదేరి సిద్దప్పలా వెనక్కి

15 Nov, 2015 12:53 IST|Sakshi
గబ్బర్‌సింగ్‌లా బయలుదేరి సిద్దప్పలా వెనక్కి

చేస్తే రాజకీయాలు చేయండి లేకపోతే సినిమాలు చేసుకోండి
పవన్‌కల్యాణ్‌కు తెలకపల్లి రవి హితవు
 
ఒంగోలు: ‘చూడప్ప సిద్దప్పా.. ఉంటే రాజకీయాల్లో ఉండు, లేకపోతే సినిమాలు చేసుకో’ అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షుడు తెలకపల్లి రవి హితవు పలికారు. శనివారం ఒంగోలు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ  పవన్ కల్యాణ్ గబ్బర్‌సింగ్‌లా బయలుదేరి సిద్దప్పలా వెనక్కి వస్తున్నారని విమర్శించారు.

ఆయన ఎవరి  తరఫున ప్రశ్నిస్తున్నాడో అర్ధం కాకుండా ఉందన్నారు. ప్రశ్నించడమంటే చంద్రబాబునాయుడు చెప్పిన జవాబులు బయట చెబితే ఉపయోగమేమిటని ప్రశ్నించారు. చంద్రబాబుకు గెస్ట్‌గా ఉండకూడదని, గెస్టు ఆర్టిస్టులా అప్పుడప్పుడు కనిపించి ఏవో డైలాగులు చెబితే ఏమి లాభమని, ప్రజలను తప్పుతోవ పట్టించడమేనని ధ్వజమెత్తారు. రాజకీయ నాయకులపై ప్రజలకు ఉన్న చులకనభావాన్ని పవన్‌కల్యాణ్  మరింత తగ్గిస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా లేదు, ప్యాకేజీ లేదు, ఇవ్వకపోతే చూద్దాం అంటున్నారని , ఇప్పటికే మూడోవంతు పాలన కాలం ముగిసి పొయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
 
చంద్రబాబునాయుడు రాయలసీమకు వెళ్లి తాను రాయలసీమ బిడ్డనని చెప్పుకోవడం వల్ల ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు. అమరావతి చుట్టూ 21 నగరాలు నిర్మిస్తామని చెబుతున్నారని, అసలు అమరావతి పట్టణాన్ని ఇంతవరకూ పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు.  ఆయన కట్టబోయే రాజధాని  స్టేట్ స్పాన్సర్డ్ సింగపూర్ వెంచర్ అని రవి ఎద్దేవా చేశారు.
 
బీహార్ ఓటమి తర్వాత కూడా బీజెపీ గుణపాఠం నేర్చుకోలేదని, మీడీయాలో ఎఫ్‌డీఐలను అనుమతించడం ద్వారా తాము కార్పొరేట్ రంగానికి దగ్గరగా ఉన్నట్లు చెప్పుకుంటోందని, మరోవైపు కర్ణాటకలో టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాలను వివాదం చేయడం సరికాదన్నారు.

దేశంలో పెరుగుతున్న మతపరమైన అసహనంపై తెలుగురాష్ట్రాల ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడకపోవడం మంచిపద్దతి కాదన్నారు. లౌకిక వారసత్వానికి ప్రతీకగా ఉన్న గురజాడ శతవర్ధంతి ఉత్సవాలను పెద్ద ఎత్తున జరపాలని సూచించారు. అదే సమయంలో విశ్వనాధసత్యనారయణ పేరును ముందుకు తెచ్చి వివాదం చేయడం సరికాదన్నారు.

మరిన్ని వార్తలు