తెలంగాణ దారిలో...

31 Jul, 2013 06:00 IST|Sakshi
తెలంగాణ దారిలో...

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభిస్తామంటూ కేంద్రం ప్రకటన చేసిన 2009 డిసెంబర్ 9 నుంచి.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించిన ఈ ఏడాది జూలై 30 వరకు ఎన్నో  పరిణామాలు, మరెన్నో ఘటనలు... అందులో ముఖ్యమైన అంశాలు సంవత్సరాల వారీగా...  
    - సాక్షి, హైదరాబాద్
 
 2009
 డిసెంబరు 9: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం ప్రయత్నాలు ప్రారంభిస్తుందని అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటన.
 10: 9న చేసిన ప్రకటనను పార్లమెంట్‌కు తెలియజేసిన చిదంబరం. ప్రకటనను నిరసిస్తూ సీమ, కోస్తా ప్రాంత ఎమ్మెల్యేల రాజీనామాలు. అంతటా నిరసనలు
 23: ప్రకటనను సవరించుకుంటూ... విస్తృత స్థాయిలో చర్చలు కొనసాగుతాయని చిదంబరం ప్రకటన
 ూ  మంత్రి జానారెడ్డి ఇంటికి వెళ్లిన కేసీఆర్.. జేఏసీ ఏర్పాటు చేస్తామని వెల్లడి. తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధుల రాజీనామాలు.. మళ్లీ భగ్గుమన్న నిరసనలు.
 24: తెలంగాణ జేఏసీ చైర్మన్‌గా కోదండరాం. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీల రాజీనామాలు.
 25: తమ పదవులకు రాజీనామా చేస్తామని తెలంగాణ ప్రాంత మంత్రుల ప్రకటన
 26: తెలంగాణ సాధనకు ఆ ప్రాంత కాంగ్రెస్ నాయకుల కమిటీ ఏర్పాటు
 31: తెలంగాణ అంశంపై చర్చించేందుకు 2010 జనవరి 5న కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో సమావేశం జరుపుతామని చిదంబరం ప్రకటన.. కాంగ్రెస్, టీడీపీ, పీఆర్పీ, టీఆర్‌ఎస్, ఎంఐఎం, సీపీఐ, సీపీఎం, బీజేపీలకు ఆహ్వానం.
 
 2010
 జనవరి 5: ప్రత్యేక, సమైక్య ఆందోళనల నేపథ్యంలో రాష్ట్రంలోని గుర్తిం పు పొందిన రాజకీయ పార్టీలతో ఢిల్లీలో కేంద్ర హోంశాఖ సమావేశం.
 28: రాష్ట్ర పరిస్థితుల అధ్యయనానికి కమిటీని నియమించనున్నట్లు అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటన.
 ఫిబ్రవరి 3: రాష్ట్ర పరిస్థితుల అధ్యయనానికి కమిటీ ఖరారు. సారథిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శ్రీకృష్ణ, మరో నలుగురు సభ్యుల నియామకం.
 12: శ్రీకృష్ణ కమిటీ విధి విధానాల ఖరారు. తెలంగాణ జిల్లాల్లో మళ్లీ అలజడి.
 15: జేఏసీ నుంచి బయటకు వచ్చిన కాంగ్రెస్
 మార్చి 4: రాష్ట్రానికి శ్రీకృష్ణ కమిటీ రాక.. అన్ని పార్టీల అధినేతలతో సమావేశం.
 18: ‘హైదరాబాద్’ ఫ్రీజోన్‌ను రద్దు చేయాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో ఏకవాక్య తీర్మానం. ఆమోదించిన సభ.
 డిసెంబర్ 30:  కేంద్ర హోంశాఖకు నివేదికను సమర్పించిన శ్రీకృష్ణ కమిటీ. నివేదికపై చర్చించేందుకు 2011 జనవరి 6న గతంలో పిలిచిన 8 పార్టీలతో ఢిల్లీలో సమావేశం నిర్వహిస్తామని వెల్లడించిన కేంద్రం.
 
 2011
 జనవరి 2: ఆరో తేదీన జరిగే అఖిలపక్ష భేటీలో పాల్గొనకూడదని టీఆర్‌ఎస్, బీజేపీ నిర్ణయం
 జనవరి 6: శ్రీకృష్ణ కమిటీ నివేదిక వెల్లడి.. ఢిల్లీలో అఖిలపక్ష భేటీ.. టీఆర్‌ఎస్, బీజేపీతో పాటు టీడీపీ కూడా భేటీకి దూరం.
 ూ తెలంగాణ సమస్యకు ఆరు పరిష్కార మార్గాలను సూచించిన శ్రీకృష్ణ కమిటీ.. నివేదికలోని అంశాలపై పార్టీల అభిప్రాయాలు తెలుసుకునేందుకు నెల రోజుల్లో మరోసారి సమావేశం ఏర్పాటు చేస్తామని చిదంబరం వెల్లడి (దాదాపు రెండేళ్ల పాటు ఎలాంటి సమావేశం జరగలేదు)
 శ్రీకృష్ణ కమిటీ సూచించిన ఆరు పరిష్కారాలు..
 1) రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచడం.
 2) రాష్ట్రాన్ని విభజించి, హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయడం. రెండు రాష్ట్రాలు సొంత రాజధానులు ఏర్పాటు చేసుకోవడం.
 3) సీమ, తెలంగాణను కలిపి రాయల తెలంగాణగా ఏర్పాటు చేయడం. కోస్తాను ఒక రాష్ట్రంగా విభజించడం. హైదరాబాద్‌ను రాయల తెలంగాణలో భాగంగా ఉంచడం.
 4) రాష్ట్రాన్ని సీమాంధ్ర, తెలంగాణగా విభజించడం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిని మరింత పెంచి దాన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేయడం. నల్లగొండ, రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్‌ల నుంచి కొన్ని మండలాలను గ్రేటర్‌లో కలపడం.
 5) రాష్ట్రాన్ని సీమాంధ్ర, తెలంగాణగా విభజించి.. హైదరాబాద్‌ను తెలంగాణ రాజధానిగా ఉంచడం. సీమాంధ్రకు కొత్త రాజధాని ఏర్పాటు చేయడం.
 6) రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి తెలంగాణ ప్రాంత సామాజిక, ఆర్థికాభివృద్ధికి.. రాజకీయ సాధికారతకు చట్టపరమైన చర్యలు తీసుకోవడం. చట్టబద్ధమైన అధికారాలతో తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేయడం.
 మార్చి 10: హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో మిలియన్ మార్చ్ కార్యక్రమం.
 సెప్టెంబర్ 13: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌తో తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో పది జిల్లాలలో ‘సకల జనుల సమ్మె’ ప్రారంభం. సమ్మెలో పాల్గొన్న అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు.. 42 రోజుల పాటు కొనసాగి అక్టోబర్ 24న ముగిసిన సమ్మె. సకల జనుల సమ్మెలో భాగంగా జరిగిన రైల్‌రోకోల్లో పాల్గొన్న అధికార పార్టీ ఎంపీలపై పోలీసు కేసుల నమోదు.. జైలుకు తరలింపు.
 నవంబరు 12: తెలంగాణ జటిలమైన సమస్య అని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ వ్యాఖ్య.
 
 2012
 డిసెంబర్ 5: తెలంగాణ అంశంపై ఏదో ఒకటి తేల్చకుంటే.. దేశంలోకి ఎఫ్‌డీఐలకు అనుమతినిచ్చే అంశంపై లోక్‌సభలో జరిగే చర్చ, ఓటింగ్‌కు తాము దూరంగా ఉంటామని పార్టీ అధిష్టానాన్ని హెచ్చరించిన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు.. దిగొచ్చిన అధిష్టానం.. డిసెంబర్ 28న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే ప్రకటన. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, ఎంఐఎంలతో పాటు కొత్తగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని భేటీకి రమ్మని ఆహ్వానం.
 డిసెంబర్ 28: కేంద్ర హోంమంత్రి అధ్యక్షతన ఎనిమిది రాజకీయ పార్టీలతో అఖిలపక్ష భేటీ. (అంతకుముందు జాబితాలోలేని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆహ్వానించారు) సమస్యకు నెల రోజుల్లో పరిష్కారం తెలియజేస్తామని షిండే ప్రకటన.
 
 2013
 జనవరి 24: షిండే నెల రోజుల్లో అంటే నెల రోజుల వ్యవధిలోనే ప్రకటన చేయాలనడం సరికాదని సోనియాతో భేటీ అనంతరం రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి ఆజాద్ వెల్లడి
 27: తెలంగాణపై నిర్ణయానికి ఎలాంటి డెడ్‌లైన్లూ లేవని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి ఆజాద్.. నిర్ణయానికి ఇంకా సమయం పడుతుందని కేంద్ర హోం మంత్రి షిండే ప్రకటన
 జూన్ 2: తెలంగాణపై నిర్ణయం తీసుకోవడంలో కాంగ్రెస్ జాప్యం చేస్తోందంటూ పార్టీ ఎంపీలు జి.వివేక్, మందా జగన్నాథం, సీడబ్ల్యూసీ మాజీ సభ్యుడు కె.కేశవ రావు పార్టీకి రాజీనామా చేసి, టీఆర్‌ఎస్‌లో చే రిక.
 16: ఆజాద్ స్థానంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా దిగ్విజయ్‌సింగ్ నియమాకం
 18: తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, నేతలు హైదరాబాద్‌లో భేటీ.. 30వ తేదీన నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం
 30: నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో తెలంగాణ సాధన సభను నిర్వహించిన తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు.. కాంగ్రెస్‌తోనే తెలంగాణ సాధ్యమని నేతల ప్రకటనలు
 ూ  దిగ్విజయ్ సింగ్ విశాఖపట్నం రాక.. ఆయనను కలిసి ‘రాష్ట్రాన్ని విభజిస్తే ఊరుకోం’ అంటూ వినతిపత్రం ఇచ్చిన సీమాంధ్ర ప్రాంత ప్రతినిధులు.
 జూలై 1: హైదరాబాద్‌కు దిగ్విజయ్‌సింగ్ రాక. తమ అభిప్రాయాలను ఆయన దృష్టికి తీసుకెళ్లిన ఇరు ప్రాంతాల ప్రజా ప్రతినిధులు
 1: తెలంగాణ అంశంపై అధిష్టానం త్వరలోనే నిర్ణయం వెల్లడిస్తుందని దిగ్విజయ్‌సింగ్ వెల్లడి. అందుకు సంబంధించి రోడ్‌మ్యాప్‌లు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పీసీసీఅధ్యక్షుడికి ఆదేశం
 2: కోస్తా, సీమ ప్రాంతంలో సమైక్యాంధ్ర ఉద్యమ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి పార్టీ నేతలకు దిగ్విజయ్ అనుమతి
 9: ఢిల్లీలో 12వ తేదీన జరిగే పార్టీ కోర్ కమిటీ సమావేశానికి రావాలంటూ సీఎం కిరణ్, డిప్యూటీ సీఎం రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్సకు అధిష్టానం పిలుపు
 12: కాంగ్రెస్ పార్టీ కోర్‌కమిటీ సమావేశానికి హాజరైన సీఎం కిరణ్, డిప్యూటీ సీఎం రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స. అధిష్టానం పెద్దలకు వారివారి అభిప్రాయాల వెల్లడి.
 ూ  కోర్ కమిటీ సమావేశ అనంతరం ‘తెలంగాణ అంశంపై సంప్రదింపుల ప్రక్రియ ముగిసింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటాం’ అని దిగ్విజయ్‌సింగ్ ప్రకటించారు.
 23: తెలంగాణ అంశంపై చర్చించేందుకు సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ అధ్యక్షుడిని 26వ తేదీన మరోసారి ఢిల్లీ రావాల్సిందిగా అధిష్టానం పిలుపు
 26: ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ వార్‌రూం చర్చల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు. చర్చల అనంతరం పార్టీ కోర్ కమిటీ సమావేశమై తెలంగాణ అంశంపై చర్చ..
 ూ  కోర్ కమిటీ సమావేశం అనంతరం దిగ్విజయ్‌సింగ్ విలేకరులతో మాట్లాడుతూ ‘తెలంగాణ అంశంపై సంప్రదింపుల ప్రక్రియ ముగిసింది. కాంగ్రెస్ పార్టీ, యూపీఏ ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూద్దాం’ అని వెల్లడించారు.
 29:  యూపీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశాలను 30వ తేదీన నిర్వహించాలని నిర్ణయం. ఢిల్లీ రావాల్సిందిగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడికి పిలుపు
 30: ఢిల్లీలో సాయంత్రం నాలుగున్నర గంటలకు సమావేశమైన యూపీఏ మిత్రపక్షాలు.. 50 నిమిషాల పాటు కొనసాగిన సమావేశం. అనంతరం ఐదున్నర గంటలకు సీడబ్ల్యూసీ భేటీ.
 ూ  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తాము సిద్ధమేనని కాంగ్రెస్ ప్రకటన
 ూ  పది జిల్లాలతో కూడిన తెలంగాణను ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదిస్తామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్, కేంద్ర మంత్రి అజయ్ మాకెన్ వెల్లడి.

మరిన్ని వార్తలు