ఆ ఆలయం హుండీ నిండా.. పెద్దనోట్ల కట్టలు!

12 Nov, 2016 20:47 IST|Sakshi
ఆ ఆలయం హుండీ నిండా.. పెద్దనోట్ల కట్టలు!
సాక్షి, ముంబై: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో దేవుళ్ల హుండీకీ డిమాండ్‌ పెరిగిపోయినట్టు కనిపిస్తోంది. చాలామంది భక్తులు రద్దైన రూ. 500, రూ. వెయ్యి నోట్లను హుండీలో కానుకలుగా సమర్పిస్తున్నారు. దీంతో అన్నీ ఆలయాల హుండీలు పాత నోట్ల కట్టలతో కళకళలాడుతున్నాయి. తాజాగా షిర్డీ సాయిబాబా ఆలయానికీ పాతనోట్ల రూపంలో కానుకలు వెల్లువెత్తాయి.

గత మూడు రోజుల్లో షిరిడీ హూండీలలో భక్తులు రూ. 1.50 కోట్ల కానుకలుగా సాయిబాబాకు సమర్పించగా, వీటిలో ఏకంగా రూ. 1.07 కోట్లు రద్దైన రూ. 500, 1000 నోట్లే కావడం విశేషం. షిర్డీ సాయిసంస్థాన్ పెద్ద నోట్లను స్వీకరించడం లేదని ప్రకటించినప్పటికీ అనేకమంది భక్తులు పాత నోట్లనే హుండీలో వేస్తున్నారు. రానున్న రోజుల్లోనూ మరిన్ని పాత నోట్లు హుండీలలో దర్శనమిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఇలా జరగకుండా ఉండేందుకు మరాఠ్వాడాలోని అనేక మందిరాల్లో ఉన్న హుండీలను సీల్ చేసేశారు. మరోవైపు ఆలయ హుండీలలో సమర్పించే కానుకలకు లెక్క చెప్పాల్సిన అవసరం లేదని కేంద్రం పేర్కొన్న సంగతి తెలిసిందే. 
మరిన్ని వార్తలు