జయలలిత కోసం ఏకంగా 10వేల మంది...!

9 Oct, 2016 16:11 IST|Sakshi
జయలలిత కోసం ఏకంగా 10వేల మంది...!

చెన్నై: తీవ్ర అనారోగ్యానికి గురై.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆమె అభిమానులు, అన్నాడీఎంకే కార్యకర్తలు కనిపించిన ప్రతి దేవుడికీ మొక్కుకుంటున్నారు. అమ్మ కోసం ప్రార్థనలు చేస్తున్నారు. అమ్మ ఆరోగ్యం కుదటపడాలని  ప్రత్యేక పూజలు, వత్రాలూ, దీక్షలూ చేస్తున్నారు.  

తాజగా అమ్మపై అభిమానాన్ని చాటుకుంటూ.. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఏకంగా 10వేల మందికిపైగా అభిమానులు మురుగన్‌కు పాలాభిషేకం చేశారు. సంప్రదాయ దుస్తులు ధరించి.. అత్యంత భక్తిశ్రద్ధలతో తలపై పాలబిందెలను మోసుకొస్తూ.. పాదయాత్రగా 10వేలమంది ఒకేసారి తిరుపరాంకుండ్రమ్‌ మురుగన్‌ ఆలయాన్ని సందర్శించారు. అమ్మ తిరిగి సంపూర్ణ ఆరోగ్యాన్ని సంతరించుకోవాలని కోరుతూ మురుగన్‌కు ఏకంగా 10వేలమంది భక్తులు పాలాభిషేకం చేశారు. గుండెలపై అమ్మ ఫొటోను పెట్టుకొని భక్తులు ఈ మహా ఉత్సవంలో పాల్గొన్నారు. ఒకేసారి వేలమంది పాలబిందెలతో ఇక్కడికి రావడంతో మురుగన్‌ ఆలయం వద్ద జాతర వాతావరణం నెలకొంది.

గత 15రోజులకుపైగా చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలలితకు ప్రస్తుతం కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. ఆమె కోలుకోవడానికి వైద్యబృందం ప్రత్యేక చికిత్స అందిస్తున్న సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు