టెన్త్ పరీక్షల షెడ్యూలు సిద్ధం!

27 Nov, 2015 04:01 IST|Sakshi
టెన్త్ పరీక్షల షెడ్యూలు సిద్ధం!

సాక్షి, హైదరాబాద్: టెన్త్ పరీక్షల షెడ్యూల్ సిద్ధమైంది. 2016 మార్చి 21 నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు నిర్వహించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. టైంటేబుల్  ఫైలును ప్రభుత్వ ఆమోదం కోసం గురువారం పంపినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. పదో తరగతి ప్రధాన పరీక్షలు 21వ తేదీన ప్రారంభమై ఏప్రిల్ 4తో ముగుస్తాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు పరీక్షలుంటాయి. ద్వితీయ భాష పరీక్ష మాత్రం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు ఉంటుంది.

ఇది ఒక పేపరే ఉంటుంది. మిగతా సబ్జెక్టులు రెండు పేపర్లు చొప్పున  ఉంటాయి. మార్చి 23న హోలీ, 25న గుడ్ ఫ్రైడే, 27వ తేదీ ఆదివారం, ఇక ఏప్రిల్ 3వ తేదీ ఆదివారం, 5న జగ్జీవన్‌రామ్ జయంతి, 8న ఉగాది కావడంతో ఆయా తేదీలను తొలగించి టైంటేబుల్‌ను రూపొందించారు. పరీక్షల ఫలితాలను మే 20-25 మధ్య విడుదల చేసేందుకు తాత్కాలికంగా షెడ్యూలును ఖరారు చేసినట్లు సమాచారం. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆమోదం లభించగానే మూడు నాలుగు రోజుల్లో టైంటేబుల్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు.
 
హోలీ తేదీని బట్టి స్వల్ప మార్పులు
హోలీ సెలవు దినాన్ని ప్రభుత్వం ప్రకటించే రోజును బట్టి షెడ్యూలులో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. మార్చి 23న ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటిస్తే టైంటేబుల్ ఇలా ఉండే అవకాశం ఉంది. లేదా 22న సెలవు అయితే ప్రథమ భాష పేపరు-2 పరీక్ష 23న నిర్వహించే అవకాశం ఉంది. 2016లో ప్రభుత్వం ప్రకటించే సెలవు దినాలకు సంబంధించిన ఫైలు ప్రస్తుతం సీఎం కేసీఆర్ పరిశీలనలో ఉంది. దీనికి ఒకట్రెండు రోజుల్లో ఆమోదం లభించే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు