బందీగా చిక్కిన తరుషిని చంపేశారు!

2 Jul, 2016 18:07 IST|Sakshi
బందీగా చిక్కిన తరుషిని చంపేశారు!

ఢాకా/న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉగ్రవాదులు జరిపిన నరమేధంలో ఓ భారతీయ అమ్మాయి కూడా ప్రాణాలు కోల్పోయింది. ఢాకాలో ఉగ్రవాదాలు తమ ఆధీనంలోకి తీసుకున్న హోలీ ఆర్టిసన్ బేకరీలో భారతీయ అమ్మాయి అయిన తరుషి జైన్‌ (19) చిక్కుకుపోయింది. ఆమెను బందీగా చేసుకున్న ఉగ్రవాదులు కిరాతకంగా హతమార్చారు. తరుషి జైన్‌ సహా తమకు బందీలుగా చిక్కిన మొత్తం 20మందిని ఉగ్రవాదులు పదునైన ఆయుధాలతో నరికి చంపారు. వీరందరూ విదేశీయులే. శుక్రవారం రాత్రి ఢాకాలోని ఆర్టిసన్ బేకరీలోకి చొరబడిన సాయుధ ఉగ్రవాదులు.. అందులోని వారిని బందీలుగా తీసుకొని నరమేధానికి దిగిన సంగతి తెలిసిందే.
 

మృతుల్లో భారతీయ బాలిక తరుషి కూడా ఉందని, ఆమె మృతి బాధ కలిగిస్తున్నదని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ట్విట్టర్‌లో తెలిపారు. తరుషి తండ్రి సంజీవ్ జైన్‌తో మాట్లాడి.. తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశానని, ఈ కష్టకాలంలో ఆయన కుటుంబానికి యావత్‌ దేశం అండగా ఉందని పేర్కొన్నారు.

కాగా, 10 గంటలపాటు కొనసాగిన ఆపరేషన్‌లో భాగంగా ఆరుగురు ఉగ్రవాదులను బంగ్లా భద్రతా దళాలు హతమార్చాయి. మరో ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నాయి. ఉగ్రవాదుల చేతుల్లో బందీలుగా ఉన్న 13మందిని సురక్షితంగా రక్షించాయి. ఉగ్రవాదుల చేతిలో బందీలుగా చిక్కి సురక్షితంగా బయటపడిన 13మందిలో ముగ్గురు విదేశీయులు ఉన్నారు. అందులో ఒకరు జపనీస్‌ కాగా, మరో ఇద్దరు శ్రీలంక వాసులు.

>
మరిన్ని వార్తలు