కీలక పరిణామం.. శశికళతో అజిత్ భేటీ!

27 Dec, 2016 16:48 IST|Sakshi
కీలక పరిణామం.. శశికళతో అజిత్ భేటీ!

తమిళనాడులో కీలక పరిణామం. ప్రముఖ తమిళ హీరో అజిత్ సోమవారం దివంగత సీఎం జయలలిత సన్నిహితురాలు శశికళ నటరాజన్ తో భేటీ అయినట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. జయలలిత మరణం తర్వాత అధికార అన్నాడీఎంకే పగ్గాలు శశికళ చేపట్టాలన్న డిమాండ్ ఊపందుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా తాను పగ్గాలు చేపట్టే విషయంలో అజిత్ మద్దతు కూడగట్టేందుకే ఈ భేటీ జరిగినట్టు భావిస్తున్నారు. పోయెస్ గార్డెన్‌ లో శశికళతో అజిత్ సమావేశమైన విషయాన్ని అన్నాడీఎంకే వర్గాలు ధ్రువీకరించాయి. మర్యాదపూర్వకంగా ఈ భేటీ జరిగినట్టు ఆ వర్గాలు మీడియాకు చెప్పాయి. అయితే, ఈ కథనాలను హీరో అజిత్ ధ్రువీకరించడం లేదని తెలుస్తోంది.

తన తాజా చిత్రం షూటింగ్‌ లో భాగంగా బల్గేరియాలో తీరిక లేకుండా గడుపుతున్న అజిత్ క్రిస్మస్ పండుగను కుటుంబసభ్యులతో జరుపుకొనేందుకు ఇటీవల చెన్నై తిరిగి వచ్చారు. శశికళతో భేటీ కథనాలను అజిత్ తోసిపుచ్చుతుండటంతో నిజానిజాలేమిటన్నది తెలియాల్సి ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.


జయలలిత రాజకీయ వారసుడిగా అజిత్ పేరు ఆమధ్యకాలంలో తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. జయలలిత గత సెప్టెంబర్ 22న ఆస్పత్రిలో చేరిన వెంటనే ఆమెను మొదట పరామర్శించింది కూడా అజితే.. ఆమె మరణించిన విషయాన్ని అర్ధరాత్రి ప్రకటించడంతో హుటాహుటిన వచ్చి మెరీనా బీచ్ లో అమ్మకు శ్రద్ధాంజలి ఘటించారు. జయలలితతో అజిత్ ఆత్మీయంగా ఉండేవారని, అతన్ని తన కొడుకుగా జయలలిత భావించేవారని అంటారు. ఈ నేపథ్యంలో అమ్మ వారసత్వం విషయంలో అజిత్ కూడా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంటున్నట్టు కనిపిస్తోంది.
 

మరిన్ని వార్తలు