న్యూఢిల్లీ: 'ఇంటర్నెట్ న్యూట్రాలిటీకి మేం పూర్తిగా మద్దతునిస్తాం. ప్రపంచవ్యాప్తంగా నెట్ న్యూట్రాలిటీని ఉండాలని మేం కోరుతున్నాం. అదే సమయంలో ప్రజలకు ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి తెచ్చేందుకు మేం పనిచేస్తున్నాం'అని ఫేస్బుక్ స్థాపకుడు మార్క్ జుకర్బర్గ్ తెలిపారు. ఇంటర్నెట్ న్యూట్రాలిటీ (సమానత్వాని)కి ఫేస్బుక్ ఆధ్వర్యంలోని ఇంటర్నెట్.ఓఆర్జీ మద్దతునిస్తుందా? అని ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు.
ఇంటర్నెట్ వినియోగంలో ఎలాంటి వివక్ష, ఆంక్షలు లేకుండా, అందరికీ ఇంటర్నెట్ సేవలు ఒకేరకంగా అపరిమితంగా అందించాలని కోరుతూ ఇంటర్నెట్ న్యూట్రాలిటీ ఉద్యమం ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. 'ఇంటర్నెట్ సదుపాయం ఉన్నవాళ్లే ఇంటర్నెట్ న్యూట్రాలిటీ కోసం ఆన్లైన్ పిటిషన్ల ద్వారా ఉద్యమిస్తున్నారు. నెట్ సదుపాయం లేనివాళ్లు సంగతి ఏమిటి.. వారు తమకు యాక్సెస్ కావాలంటూ పిటిషన్పై సంతకం చేయలేరు కదా' అని పేర్కొన్నారు. ఢిల్లీ ఐఐటీలో విద్యార్థులతో ముచ్చటిస్తూ జుకర్బర్గ్ తెలిపిన కీలకాంశాలివి..
టెక్నాలజీ.. సూపర్ న్యాచురల్ పవర్!
మీకు మానవాతీత శక్తులు వస్తే ఏం చేస్తారు అన్న ప్రశ్నకు జుకర్బర్గ్ బదులిస్తూ.. టెక్నాలజీ అందుబాటులో ఉంటే చాలు మీకోసం మీరు ఎలాంటి మానవాతీత శక్తులైన రూపొందించవచ్చు అని పేర్కొన్నారు.