కోల్కతా: త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పునరుద్ఘాటించారు. అలాగే కేంద్రంలో కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలతో కూడిన ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు మరోసారి పిలుపునిచ్చారు. కేంద్రంలో వంశ పాలన, అల్లర్ల కారకుల ప్రభుత్వం ఏర్పడకూడదని కోరుకుంటున్నట్లు పరోక్షంగా కాంగ్రెస్, బీజేపీలపై మండిపడ్డారు. గురువారం కోల్కతాలో జరిగిన బహిరంగసభలో ఆమె పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. రాష్ట్రాల ప్రయోజనాలను పరిరక్షించేందుకు కేంద్రంలో ప్రాంతీయ పార్టీలతో కూడిన ఫెడరల్ ఫ్రం ట్ ఏర్పడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఒకవేళ అటువంటి ప్రభుత్వం ఏర్పడితే తమ పార్టీ మద్దతు ఇస్తుందని మమత తెలిపారు.
దేశంలో కాంగ్రెస్, బీజేపీలకు తమ పార్టీయే ప్రత్యామ్నాయం అన్నారు. ‘బెంగా ల్ నేడు ఏం ఆలోచిస్తుందో ఆ విషయాన్ని దేశం మర్నా డు ఆలోచిస్తుంది’ అన్న స్వాతంత్య్ర సమరయోధుడు గోపాలకృష్ణ గోఖలే వ్యాఖ్యలను మమత ఉటంకిం చారు. బెంగాల్తోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తామని... అక్కడా తాను ప్రచారం చేస్తానని చెప్పారు.