తాగునీటి పథకం వేగవంతం

10 Sep, 2015 02:53 IST|Sakshi

- మొదటి దశ బిడ్లు ఓపెన్
- మరోసారి పరిశీలించి 9 సెగ్మెంట్లలో కాంట్రాక్టు త్వరలో ఖరారు
- రెండో దశ టెక్నికల్ బిడ్లు ఓపెన్ చేసిన అధికారులు
- మూడో దశకు నేటి నుంచి టెండర్లు
సాక్షి, హైదరాబాద్:
రాష్ట్రంలో మూడు దశల్లో చేపట్టనున్న తెలంగాణ తాగునీటి పథకానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. రూ.6,589 కోట్లతో చేపట్టనున్న మూడో దశ టెండర్లకు ఇటీవల టెండర్ నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం నేటి నుంచి ఈ-ప్రొక్యూర్‌మెంట్ ద్వారా ఆ పనుల కోసం టెండర్ల దాఖలుకు అవకాశం కల్పించింది. ఇక మొదటి దశ టెండర్ల ప్రక్రియలో కీలక ఘట ్టం బుధవారంతో ముగిసింది. 9 సెగ్మెంట్లలో చేపట్టే ఈ పనులకు సంబంధించిన ఫైనాన్షియల్ బిడ్లను తెరిచింది.

దేశ వ్యాప్తంగా వివిధ కంపెనీలు ఈ-ప్రొక్యూర్‌మెంట్ వెబ్‌సైట్‌లో టెండర్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ టెండర్లలో అంచనా విలువల కంటే తక్కువ మొత్తానికి టెండర్లు దాఖలు చేసిన కంపెనీల ఫైనాన్షియల్ బిడ్లను ప్రాథమికంగా గుర్తించింది. వీటిపై మరోసారి పరిశీలన జరిపి, చర్చించి టెండర్లను త్వరలోనే ఖరారు చేయనుంది. అలాగే రెండో దశ టెండర్ల టెక్నికల్ బిడ్లను బుధవారం తెరిచింది. ఇందులో వివిధ కంపెనీల సాంకేతిక అర్హతలను పరిశీలించిన తరువాత ప్రాజెక్టు నియమ నిబంధనలకు అనుగుణంగా ఉన్న కంపెనీల ఫైనాన్షియల్ బిడ్లను త్వరలోనే తెరిచేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది.

మరిన్ని వార్తలు