టాయిలెట్ కంపు.. దిగిపోయిన విమానం

6 Mar, 2017 07:52 IST|Sakshi
టాయిలెట్ కంపు.. దిగిపోయిన విమానం

సాధారణంగా బస్టాండ్లలో టాయిలెట్లు కంపు కొడితే వాటికి దూరంగా వెళ్లి నిలబడతాం. అదే రైళ్లలో అయితే అటువైపు వెళ్లడం మానేసి ఊరుకుంటాం. కానీ వేలకు వేలు పోసి టికెట్లు కొనుక్కున్న విమానంలోనే టాయిలెట్లు కంపు కొడితే..? లోపల ఉన్నవాళ్లు అసలు భరించే పరిస్థితి ఉండదు. అలాంటప్పుడు తప్పనిసరిగి విమానాన్ని దించేయాల్సి ఉంటుంది. తాజాగా ఓ స్పైస్‌జెట్ విమానంలో ఇలాగే జరిగింది.

బెంగళూరు నుంచి ఢిల్లీకి ఓ విమానం బయల్దేరింది. అందులో 188 మంది ప్రయాణికులున్నారు. విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే టాయిలెట్ నుంచి ఘోరమైన దుర్వాసన వస్తోందని చాలామంది ఫిర్యాదు చేశారు. కాసేపటికి అది ఇక భరించలేని స్థితికి చేరుకుంది. చివరకు సిబ్బంది కూడా తమ వల్ల కాదని చేతులెత్తేశారు. దాంతో.. ఇక అక్కడకు సమీపంలోనే ఉన్న హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో విమానాన్ని దించేశారు. ఏకంగా టాయలెట్ నుంచి కాక్‌పిట్ వరకు కూడా దుర్వాసన వచ్చేయడంతో స్పైస్‌జెట్ విమానం బి-737ను హైదరాబాద్‌లో దించేయాల్సి వచ్చిందని స్పైస్‌జెట్ ప్రతినిధి ఒకరు తెలిపారు. హైదరాబాద్‌లో ల్యాండయిన తర్వాత మొత్తం అంతా శుభ్రం చేసి, బాగా గాలి ఆడనిచ్చి ఆ తర్వాత విమానాన్ని నడిపించినట్లు వివరించారు.

మరిన్ని వార్తలు