ట్రంప్‌ సభలో టాప్‌లేపిన తెలుగోళ్లు!

16 Oct, 2016 16:14 IST|Sakshi
ట్రంప్‌ సభలో టాప్‌లేపిన తెలుగోళ్లు!

ఎడిసన్‌ (న్యూజెర్సీ): అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ పాల్గొన్న సభలో టాలీవుడ్‌ స్టార్లు దుమ్మురేపారు. ట్రంప్‌కు మద్దతుగా ఇండియన్‌ అమెరికన్స్‌ నేతృత్వంలోని హిందూ రిపబ్లికన్‌ కొలియేషన్‌ శనివారం న్యూజెర్సీలోని ఎడిసన్‌లో ఓ చారిటీ కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా టాలీవుడ్‌ స్టార్లు రాంచరణ్‌, అక్కినేని అఖిల్‌, శ్రియా, మలైకా అరోరా తదితరులతో మ్యూజిక్, మస్తీ, డ్యాన్స్‌ షోను ఏర్పాటుచేసింది. వ్యక్తిగత కారణాల వల్ల చివరి నిమిషంలో ఈ షో నుంచి మెగాహీరో రాంచరణ్‌ డ్రాప్‌ అయ్యాడు.

ఇక, అఖిల్‌, ప్రభుదేవా ఈ షోలో తమ డ్యాన్స్‌లతో దుమ్మురేపారు. టాలీవుడ్, బాలీవుడ్ సూపర్‌ హిట్‌ పాటలకు అదిరె స్టెప్పులు వేస్తూ ఆహూతులను ఉర్రూతలూగించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్‌ అనూహ్యంగా భారత్ పై ప్రశంసల జల్లు కురిపించారు. భారత్తో పాటు హిందువులకు తాను పెద్ద అభిమానినని చెప్పుకొచ్చారు. తనను అధ్యక్షుడిగా ఎన్నుకుంటే భారత్తో మంచి స్నేహసంబంధాలు కొనసాగుతాయని, ఇరుదేశాల మధ్య బంధం మరింత బలపడుతుందని తెలిపారు.  భారత్, అమెరికా బెస్ట్ ఫ్రెండ్స్ అవుతాయని అన్నారు. ప్రపంచంలోనే భారత్ అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని, భారత్కు మంచి ప్రధాని ఉన్నారంటూ పొగడ్తలు జల్లు కురిపించారు. భారత్తో పాటు, హిందు ప్రజలను తాను గౌరవిస్తానని తెలిపారు. అమెరికాకు భారత్ అత్యంత వ్యూహాత్మకమైన భాగస్వామి అని పేర్కొన్నారు.