బెంగళూరు: అంబులెన్సుకు దారి ఇవ్వడానికి రాష్ట్రపతి కాన్వాయ్నే ఆపేసిన ట్రాఫిక్ ఎస్సై, కానిస్టేబుల్లను పలువురు ప్రశంసిస్తున్నారు. సాధారణంగా దేశ ప్రథమ పౌరుడైన రాష్ట్రపతి వాహన శ్రేణిని ఆపడం అంటే మామూలు విషయం కాదు. ఒకవేళ ఆపాలన్నా పైఅధికారుల అనుమతి తప్పనిసరి. గత శనివారం బెంగళూరులోని ట్రినిటీ సర్కిల్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ ఎస్సై నిజలింగప్ప, కానిస్టేబుల్ విశ్వనాథ రావులు మాత్రం...ఎవరి అనుమతీ లేకుండా సొంత విచక్షణపై రాష్ట్రపతి వాహనశ్రేణిని కాసేపు ఆపేసి అంబులెన్సుకు దారి ఇచ్చారు. ఆ సమయంలో పైఅధికారులు అందుబాటులో లేకపోవడంతో సొంతంగా నిర్ణయం తీసుకున్నారు. వారి సాహసం గురించి కొంతమంది సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో విషయం వెలుగుచూసింది. ఎస్సై, కానిస్టేబుళ్లను అభినందించిన అధికారులు వారికి రివార్డు ఇచ్చారు.