చంద్రబాబుపై పోలీసులకు ఫిర్యాదు

5 Jun, 2017 20:39 IST|Sakshi
చంద్రబాబుపై పోలీసులకు ఫిర్యాదు

పెద్దపల్లిటౌన్‌: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజును ఆంధ్రప్రదేశ్‌లో బ్లాక్‌డేగా జరుపుకోవాలని వ్యాఖ్యానించిన ఏపీ సీఎం చంద్రబాబుపై పెద్దపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదయింది. టీఎస్‌ ముస్లిం పొలిటికల్‌ జేఏసీ, కేటీఆర్‌ యువసేన ఆధ్వర్యంలోని బృందం సోమవారం పెద్దపల్లి ఏసీపీ సింధూశర్మను కలిసి చంద్రబాబుపై ఫిర్యాదుచేశారు.

తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతినేలా మాట్లాడి ప్రత్యేక రాష్ట్రం కోసం బలిదానాలు చేసిన అమరులను కించపరిచేలా వ్యాఖ్యానించిన చంద్రబాబుపై కేసు నమోదు చేయాలని వారు ఏసీపీని కోరారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలవడాన్ని ఓర్వలేకనే చంద్రబాబు విషం కక్కుతున్నారన్నారు. రాబోయే రోజుల్లో చంద్రబాబును తెలంగాణలో అడుగుపెట్టనివ్వమని, హైదరాబాద్‌కు వస్తే అడ్డుకుంటామని స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు.

బాబుపై కేసు పెడతారా?: ముస్లిం జేఏసీ, కేటీఆర్‌ యువసేనల ఫిర్యాదుమేరకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై కేసు నమోదు చేయాలా? వద్దా? అనేదానిపై న్యాయనిపుణులతో చర్చించి, తుది నిర్ణయం తీసుకుంటామని పెద్దపల్లి ఏసీసీ సింధూ శర్మ మీడియాకు చెప్పారు.

మరిన్ని వార్తలు