వర్షాభావాన్ని అధిగమిస్తాం: కేంద్రం

4 Jun, 2015 01:24 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక స్థితిపై ప్రభావం చూపే వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరిస్తామని కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్‌సింగ్ భరోసా ఇచ్చారు. ఈ సీజన్‌లో వర్షపాత లోటు అధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా మంత్రి తన శాఖ ఆధ్వర్యంలో సాధించిన ప్రగతిని బుధవారమిక్కడ విలేకర్లకు వివరించారు.

రైతులను ఆదుకునేందుకు కొత్త పంటల బీమా పాలసీని తెచ్చే యోచనలో ఉన్నట్లు  తెలిపారు.  పప్పుధాన్యాల ఉత్పత్తి తగ్గి ధరలపై ప్రభావం పడకుండా దిగుమతులను పెంచుతామని,  నిత్యావసరాలకు లోటు రాకుండా చూసుకుంటామని చెప్పారు.  ప్రభుత్వ పరంగా వ్యవసాయ, విద్యుత్తు రంగాల్లో తగు ప్రణాళికలతో ‘వర్షపాత లోటు’ వల్ల ఏర్పడే స్థితినుంచి ఒడ్డెక్కే ప్రయత్నిస్తామన్నారు. వాతావరణ నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో తాజాగా స్టాక్‌మార్కెట్‌పై కూడా ప్రభావం పడడంతో ప్రభుత్వం అప్రమత్తమైందన్నారు. దేశవ్యాప్తంగా 580 జిల్లాల్లో ప్రత్రామ్నాయ ప్రణాళికలను అవలంబిస్తున్నామన్నారు.

>
మరిన్ని వార్తలు