బిచాణా ఎత్తేసిన మరో ఐటీ కంపెనీ

13 Jun, 2017 08:53 IST|Sakshi
బిచాణా ఎత్తేసిన మరో ఐటీ కంపెనీ

మాదాపూర్(హైదరాబాద్)‌: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం, ఆకర్షణీయమైన జీతం చెల్లిస్తామనినమ్మబలికి ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థ బిచాణా ఎత్తి వేసిన ఘటన మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రవి కుమార్‌ తెలిపిన వివరాలు.. కొండాపూర్‌లోని ఏక్తా టవర్‌లో జగదీశ్‌ అనే వ్యక్తి అవెన్యూ ఐటీ కంపెనీని కొద్ది నెలల క్రితం నెలకొల్పాడు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లుగా ఉద్యోగం ఇస్తామని చెప్పి 70 మంది నుంచి రూ.లక్ష నుంచి లక్షన్నర వరకు వసూలు చేశారు. మైండ్‌ స్పేస్‌లో స్పేసియస్‌ టవర్స్‌లో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఆఫర్‌ లెటర్లు ఇవ్వగా ఉద్యోగంలో చేరారు. నెల జీతం ఇచ్చిన తరువాత మోఖం చాటేశారు.

రెండు నెలలుగా ఇదే తంతు కొనసాగుతోంది. ఉద్యోగులు నిలదీయగా రెండు రోజులుగా జగదీష్‌ కంపెనీకి రావడం లేదు. ఈ మేరకు నల్గొండకు చెందిన మాడ్గుల గణేష్‌ ఫిర్యాదు చేశారు. హెచ్‌ఆర్‌ మేనేజర్‌ విజయవాడకు చెందిన కోతూరి కార్తీక్‌(26), కంప్యూటర్స్‌ మెయింటెనెన్స్‌ చేసే ఖమ్మం జిల్లాకు చెందిన వల్లభరెడ్డి ఫణీంద్ర కుమార్‌(28)లను రిమాండ్‌కు తరలించారు. జగదీశ్‌తో పాటు మరో ఐదుగురు పరారీలో ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు