ఆగ్రా రైల్వే స్టేషన్‌ వద్ద జంట పేలుళ్లు

18 Mar, 2017 12:18 IST|Sakshi
ఆగ్రా రైల్వే స్టేషన్‌ వద్ద జంట పేలుళ్లు

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా రైల్వే స్టేషన్‌ సమీపంలో శనివారం ఉదయం జంట పేలుళ్లు చోటుచేసుకోవడం కలకలం రేపింది.  మొదట ఓ రైల్వే ట్రాక్‌ సమీపంలోని చెత్తకుండీ వద్ద పేలుడు చోటుచేసుకోగా.. ఆ తర్వాత సమీపంలోని ఓ నివాసగృహం వద్ద మరో పేలుడు చోటుచేసుకుంది. అంతేకాకుండా రైల్వేట్రాక్‌ వద్ద ఓ బెదిరింపు లేఖ కూడా లభ్యం అయింది. అయితే, ఇవి తక్కువ తీవ్రత కలిగిన బాంబులు కావడంతో పెద్దగా నష్టం వాటిల్లలేదు. ఈ పేలుళ్లలో ఎవరూ గాయపడలేదని తెలుస్తోంది.

 సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన సంఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు చేపడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ గెలుపు, ఇటీవల లక్నోలో ఐఎస్‌ ఉగ్రవాది కాల్చివేత తదితర ఘటనల నేపథ్యంలో ఈ జంట పేలుళ్లు పోలీసుల్లో కలవరం రేపాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటన వెనుక ఉగ్రవాద చర్య ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్టు తెలుస్తోంది.