రెండు రైళ్లు ఢీ: ఇద్దరు మృతి

3 Apr, 2014 09:22 IST|Sakshi

రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రెండు రైళ్లు ఢీ కొన్నాయి. ఆ ఘటనలో ఇద్దరు ప్రయాణీకులు మరణించగా, మరో 12 మందికిపైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఘటనపై సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

రెండు రైళ్లు ఢీ కొన్న సంఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకి 410 కిలోమీటర్ల దూరంలో సోనిభద్ర సమీపంలో గత అర్థరాత్రి చోటూ చేసుకుంది. వారణాసి- శక్తినగర్ ఇంటర్ సిటీ రైలు సోనిభద్ర సమీపంలోని ఒబ్రా డామ్ రైల్వే స్టేషన్ వద్ద నిలిచి ఉంది. అయితే అప్పటికే స్టేషన్లో ఆగి ఉన్న కాత్ని ఎక్స్ప్రెస్కు రైల్వే సిబ్బంది గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతో కాత్ని ఎక్స్ప్రెస్ వేగంగా వెళ్లి  ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ను ఢీ కొట్టింది. ఆ ఘటనపై రైల్వే శాఖ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.

మరిన్ని వార్తలు