పెళ్లి మొక్కు కోసం వెళ్లివస్తూ..

24 May, 2017 12:27 IST|Sakshi
పెళ్లి మొక్కు కోసం వెళ్లివస్తూ..

► రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
►మరో 8 మందికి గాయాలు


టంగుటూరు (కొండపి) : తిరుపతి వెళ్లి పెళ్లి మొక్కు తీర్చుకుని తిరిగొస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరో 8 మందికి గాయాలయ్యాయి. జాతీయ రహదారిపై టంగుటూరు మండలంలోని సూరారెడ్డిపాలెం సమీపంలో ఐఓసీ పెట్రోలు బంకుల వద్ద మంగళవారం వేకువజామున చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకెళ్తే... గుంటూరులోని కొత్తపేటకు చెందిన సాయిరామ్‌కు ఇటీవల నాగరాణితో వివాహమైంది.

వీరి పెళ్లి మొక్కు తీర్చుకునేందుకు సాయిరామ్‌ సోదరుడు అయిన సాయిశంకర్‌ (35), అతని భార్య హనుమంతి, పిల్లలు తేజ, లక్ష్మీలహరి, తల్లిదండ్రులు రామస్వామి, అనూరాధ, బంధువు అంబటి దేవిలు నూతన దంపతులతో కలిసి కారులో తిరుపతి వెళ్లారు. మొక్కు తీర్చుకుని సోమవారం రాత్రి 10 గంటల సమయంలో తిరిగి గుంటూరు బయలుదేరారు. మంగళవారం వేకువజామున ఐఓసీ పెట్రోలు బంకుల వద్ద ఆగి ఉన్న పత్తి లోడు లారీని వెనుక నుంచి వీరి కారు ఢీకొట్టింది. దీంతో సాయిశంకర్‌తో పాటు డ్రైవర్‌ చెన్నబోయిన సుబ్బారావు(31) అక్కడికక్కడే మృతిచెందారు. మిగిలిన వారందరికీ గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు, స్థానిక ఎస్సై వెంకటేశ్వర్లు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108లో ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. మృతదేహాలను కూడా పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించి సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

మరిన్ని వార్తలు