చేతులెత్తేసిన యూనిటెక్..ఢమాలన్న షేరు

16 Aug, 2016 20:21 IST|Sakshi
చేతులెత్తేసిన యూనిటెక్..ఢమాలన్న షేరు

న్యూఢిల్లీ: పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కున్న రియల్ ఎస్టేట్  సంస్థ యూనిటెక్ లిమిటెడ్  మరిన్ని  కష్టాల్లో కూరుకుపోయింది. ఇటీవలి సుప్రీంకోర్టు ఆదేశాలతో   ఇబ్బందుల్లో పడిన సంస్థ  చెల్లింపుల విషయంలో చివరికి  చేతులెత్తేసింది.  నోయిడా, గుర్గావ్ దాని రెండు  ప్రాజెక్టుల ఆలస్యం కారణంగా..  ఇళ్లు కొనుగోలు చేసిన వారికి  డబ్బు తిరిగి చెల్లించలేమని  సుప్రీం ముందు మంగళవారం తన  నిస్సహాయతను వ్యక్తం చేసింది. దీంతో  మార్కెట్ లో  యూనిటెక్ షేరు అమ్మకాల హోరు కొనసాగింది. దాదాపు  షేర్  20 శాతం  పతనమై 4.92 స్థాయికి దిగజారింది.

''మా దగ్గర  డబ్బుల్లేవు.. డబ్బులుండి వుంటే..  నిర్మాణాలు  పూర్తి చేసి  వారికి స్వాధీనం చేసి వుండేవారమని'' యూనిటెక్ సీనియ న్యాయవాది  ఏ ఎంసింఘ్వీ,    జస్టిస్  దీపక్ మిశ్రాల,  యూయూ లలిత్ లతో కూడిన ధర్మాసనం  ముందు చెప్పారు.  ఇళ్ల కొనుగోలుదారుల సొమ్మును వెనక్కి(రిఫండ్‌) ఇచ్చే పరిస్థితుల్లో తాము లేమంటూ  సుప్రీం కోర్టుకు యూనిటెక్‌ నివేదించింది.  దీంతో సొమ్ము  వెనక్కి ఆశిస్తున్న వినియోగదారుల జాబితాను సిద్ధం చేయమని ఆదేశిస్తూ కోర్టు తదుపరి విచారణను ఈ నెల 17కి వాయిదా వేసినట్లు  సమాచారం. నోయిడా, గుర్గావ్ యూనిటెక్ ప్రాజెక్ట్లను రెండు డజన్లకు  పైగా  ఇళ్లు కొనుగోలుదారులు తమకు  ఫ్లాట్ల స్వాధీనం చేయడంలో విఫలమైన  యూనిటెక్  తమకు డబ్బు తిరిగి చెల్లించాలని కోరుతూ నేషనల్ కన్స్యూమర్ రెడ్రెస్సల్ కమిషన్ (ఎన్సీడీఆర్సీ)  ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో వారికి  వడ్డీతో సహా చెల్లించాల్సిందిగా సుప్రీం ఇటీవల ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ వివాదం ఇలా ఉండగా బీఎస్ఈ ఈ విషయంపై యూనిటెక్ నుంచి వివరణ కోరింది.

 

మరిన్ని వార్తలు