బ్యాంకు ఖాతా వినియోగానికి అనుమతివ్వండి

6 Oct, 2015 00:41 IST|Sakshi

సుప్రీం కోర్టులో ఏపీ ఉన్నత విద్యామండలి అభ్యర్థన
 
 సాక్షి, న్యూఢిల్లీ: ప్రవేశ పరీక్షల రుసుములను జమ చేసే బ్యాంకు ఖాతాలను వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని అభ్యర్థిస్తూ ఏపీ ఉన్నత విద్యామండలి సుప్రీం కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసింది. ఫైళ్లు, ఖాతాలు తెలంగాణ ఉన్నత విద్యామండలి అజమాయిషీలో ఉండటం వల్ల తమకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొంది. నాలుగు వారాల్లో బదులివ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీచేసింది. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి ఉనికిలో ఉండదన్న హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి మేలో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ఆ సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌లోని విద్యాసంస్థలకు ప్రవేశ పరీక్షలు నిర్వహించుకునే స్వేచ్ఛను కల్పిస్తూ సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. అయితే మిగిలిన అంశాలపై విచారణ పెండింగ్‌లో ఉండిపోయింది. ఏపీ తాజా పిటిషన్‌ను జస్టిస్ విక్రమ్‌జిత్ సేన్, జస్టిస్ శివకీర్తిసింగ్‌తో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. వాదనలు విన్న ధర్మాసనం విచారణను నవంబర్ 30కి వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు