ఏటీఎం క్యూలో.. పీఎం, మాజీ పీఎం, అద్వానీ!?

14 Dec, 2016 15:53 IST|Sakshi
ఏటీఎం క్యూలో.. పీఎం, మాజీ పీఎం, అద్వానీ!?

ఓవైపు నోట్ల రద్దుపై చర్చ.. మరోవైపు నాగుపాములా వంకలు తిరుగుతూ బ్యాంకులు, ఏటీఎంల ముందు భారీ క్యూలు.. ఇలాంటి సమయంలో ఓ అరుదైన ఫొటో నెటిజన్లు కంటపడింది. కాస్తా వెరైటీ ఫొటో కనిపిస్తే దానికి క్యాప్షన్‌లు రాసి కితకితలు పెట్టేవరకు మన నెటిజన్లు ఊరుకోరు కదా.. అలా ఇప్పుడు ప్రధాని మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, ఎల్‌కే అద్వానీ ఒకరి వెంట ఒకరు వరుసగా నిలబడిన ఫొటో ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తోంది.

తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఫొటోలో ముందుస్థానంలో నిలబడిన ప్రధాని నరేంద్రమోదీ కాస్తా గంభీరమైన చూపుతో దర్శనమిస్తుండగా.. ఆయన వెనుక మన్మోహన్‌సింగ్‌, ఆ వెనుక బీజేపీ  అగ్రనేత అద్వానీ, ఆ వెనుక కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ ఉన్నారు. అందరూ క్యూలో నిలబడ్డట్టూ వరుసగా నిలబడటంతో ఈ ఫొటోపై ఫన్నీ క్యాప్షన్లు పెడుతూ నెటిజన్లు పండుగ చేసుకుంటున్నారు. అన్నట్టు ఈ ఫొటోలో రాజ్‌నాథ్‌ కూడా కనిపించి కనిపించనట్టు కనిపిస్తున్నారు. ఇప్పుడు ఈ ఫొటో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

మీరు ఏటీఎం క్యూలో నిలబడ్డప్పుడు.. మీ కన్నా ముందున్న వ్యక్తి మెషిన్‌ దగ్గరకెళ్లి రెండో కార్డు తీస్తే.. మీరు ఇలాగే చూస్తారు అంటూ ఓ నెటిజన్‌ చమత్కరించగా.. మోదీ కొత్త రెండువేల నోటు, మన్మోహన్ పాత వెయ్యినోటు, అద్వానీ పాత 100 నోటు అంటూ మరొకరు పేర్కొన్నారు. ప్రధాని, మాజీ ప్రధాని, ఎప్పటికీ ప్రధాని ఆశావహ అభ్యర్థి అంటూ ఇంకొకరు క్యాప్షన్‌ ఇచ్చారు. పానీపూరీ అమ్మేవాడు అమ్మాయిలకు మాత్రమే పానీపూరి ఇస్తే.. ఇలాగే ఉక్రోషంగా ఉంటుందంటే ఒకరు.. కెప్టెన్‌, మాజీ కెప్టెన్‌, కోచ్‌ అంటూ మరొకరు చమత్కరించారు. ఏటీఎంలో డబ్బు కోసం కాదు.. జియో సిమ్‌ కోసం క్యూ కట్టినట్టు ఉన్నారే అంటూ మరొకరు ట్వీట్‌ చేశారు.
 

>
మరిన్ని వార్తలు