మళ్లీ వేలాయుధం కాంబినేషన్!

21 Oct, 2015 12:22 IST|Sakshi
మళ్లీ వేలాయుధం కాంబినేషన్!

చెన్నై: వేలాయుధం చిత్రాన్ని తమిళ ప్రేక్షకులు అంత త్వరగా మరచిపోలేరు. ముఖ్యంగా విజయ్ అభిమానులు అస్సలు మరువలేరు. అంత గ్రాండీయర్‌తో రూపొందిన భారీ చిత్రం అది. ఆ చిత్రానికి జయంరాజా దర్శకుడు (ఇటీవల మోహన్‌రాజాగా పేరు మార్చుకున్నారు). వేలాయుధం అప్పట్లో మంచి విజయం సాధించింది. ఈయన ఇటీవల తన సోదరుడు జయంరవి హీరోగా తెరకెక్కించిన తనీఒరువన్ పెద్ద విజయం సాధించింది. తెలుగులో రామ్‌ చరణ్ హీరోగా రీమేక్ కానుంది.

సల్మాన్ ఖాన్ హీరోగా హిందీలో రీమేక్ కానున్న ఈ చిత్రానికి మోహన్‌రాజానే దర్శకత్వం వహించనున్నారు. అయితే సల్మాన్‌ఖాన్ వచ్చే ఏడాది ఆగస్టు వరకూ కమిటైన చిత్రాలో బిజీగా ఉండడంతో ఈలోగా మోహన్‌రాజా తమిళంలో మరో చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా తనీఒరువన్ చిత్రం విపరీతంగా నచ్చేసిన కథానాయకుల్లో ఇళయదళపతి విజయ్ ఒకరు. అంతేకాదు వీరిద్దరూ ఇటీవల కలిసి ముచ్చటించుకున్నారని , ఆ సందర్భంగా విజయ్ తనీఒరువన్ లాంటి ఒక చిత్రం చేద్దాం అని మోహన్‌రాజాతో అన్నట్లు సమాచారం.

అలాంటి సామాజిక స్పృహ ఉన్న కథను సిద్ధం చేయమని చెప్పినట్టు టాక్. అందుకోసం రచయితలు శుభ(జంట రచయితలు)లతో మోహన్‌రాజా చర్చించి కథను రెడీ చేయనున్నారని భోగట్టా. దీంతో వేలాయుధం చిత్ర కాంబినేషన్‌లో త్వరలో అంతకు మించిన చిత్రం వచ్చే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం ఇళయదళపతి అట్లీ దర్శకత్వంలో కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్న కాక్కీ చిత్రంలో నటిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు