బాలీవుడ్ నాయకి కంగనా రనౌత్కు వివాదాలు కొత్త కాదు. బాలీవుడ్ ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి ఎక్కువంటూ ఏకంగా కరణ్ జోహర్ షోలో పేర్కొని పెద్ద దుమారమే ఆమె లేవనెత్తింది. అంతకుముందు హృతిక్ రోషన్తో గొడవపడ్డ సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఆమె మరో వివాదానికి తెరలేపింది. హన్సల్ మెహతా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆమె తాజా చిత్రం ‘సిమ్రాన్’ క్రెడిట్ ఎవరికీ దక్కాలనేది వివాదం రేపుతోంది. సిమ్రాన్ చిత్ర ఒరిజినల్ కథ వాస్తవానికి అపూర్వ అస్రానిది.
కంగనతో ఆయన ఈ సినిమాను తెరకెక్కించాలనుకున్నాడు. కానీ అది కుదరలేదు. ఈ నేపథ్యంలో బాలీవుడ్లో తెరవెనుక రాజకీయాలు ఎలా ఉంటాయో ఆయన వివరిస్తూ పెద్ద ఫేస్బుక్ పోస్టే పెట్టారు. ఆ తర్వాత ‘మణికర్ణిక’ చిత్రం విషయంలో వివాదమే రేగింది. నిజానికి ఈ చిత్రాన్ని తాను తెరకెక్కించాల్సి ఉందని, కానీ కంగన దీనిని తనవద్ద నుంచి దొంగలించిందని దర్శకుడు కేతన్ మెహతా ఆరోపించారు. తెలుగు దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో ‘మణికర్ణిక’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
ఇలా క్రెడిట్ వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో కంగనను పరోక్షంగా దెప్పిపొడుతూ మరో టాప్ హీరోయిన్ విద్యాబాలన్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం గమనార్హం. ‘దర్శకుడు ఇలా (క్రెడిట్) కార్డు కానుకగా ఇచ్చినప్పుడు ఇంకా క్రెడిట్ ఎవరికీ కావాలండి? థాంక్యూ సురేష్ త్రివేని’ అంటూ ఆమె ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్టు పెట్టి.. తన పేరిట అదనంగా వచ్చిన క్రెడిట్ కార్డు ఫొటోను పోస్టు చేసింది. విద్యాబాలన్ తాజా చిత్రం ’యువర్ సులూ’ కు సురేష్ త్రివేని దర్శకుడు. నిర్మాత తనూజ్ గార్గ్ కూడా తనదైన శైలిలో స్పందిస్తూ విద్య ఎక్స్ట్రా క్రెడిట్ అడగకముందే.. ఆమెకు దర్శకుడు క్రెడిట్ కార్డు ఇచ్చేశాడు’ అంటూ కామెంట్ చేశాడు.
ఆ తర్వాత ఈ చర్చలోకి అపూర్వ అస్రాని కూడా ప్రవేశించి.. అదనపు ‘క్రెడిట్’ కోసం నిర్మాతను విద్య డిమాండ్ చేయకముందే.. ఆమెకు నిర్మాత ఇచ్చేశాడు. హిలేరియస్’ అంటూ కామెంట్ చేశాడు. మొత్తానికి ఇన్స్టాగ్రామ్ వేదికగా జరిగిన ఈ పోస్టు లక్ష్యం ఎవరో చెప్పకనే చెప్పేశారు వీరు. కంగనను దెప్పిపొడిచేందుకు విద్య ఈ పోస్టు పెట్టిందని ఆమె సన్నిహితులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫైర్బ్రాండ్ కంగన ఎలా స్పందిస్తుందనేది ఆకస్తికరంగా మారింది.