అతను మా నాన్న కొడుకు కాదు: జయ్ దేవ్ ఠాక్రే

21 Jul, 2016 18:51 IST|Sakshi

ముంబై: ఆస్తి కోసం కోర్టుకెక్కిన బాల్ ఠాక్రే కుమారుడు జయ్ దేవ్ ఠాక్రే కేసును గురువారం ముంబై హైకోర్టును మరోసారి విచారించింది. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను వాయిదా వేసింది. శివసేన పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత నాయకుడు బాల్ ఠాక్రే, ఆయన మాజీ భార్య స్మిత తనయుడైన జయ్ దేవ్ ఠాక్రే, ఐశ్వర్య ఠాక్రే బాల్ ఠాక్రే కుమారుడు కాదంటూ ముంబై హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణ సమయంలో కొంతభాగాన్ని మాత్రమే ధర్మాసనం మీడియాకు అనుమతినిచ్చింది. మిగిలిన విచారణను జస్టిస్ పటేల్, ఇరువైపులా లాయర్లతో కలిసి సమావేశమయ్యారు. తుది తీర్పు వెలువడే వరకు చర్చకు సంబంధించిన వివరాలను మీడియాకు అందుబాటులో ఉండవని ప్రకటించారు.

కేసు విచారణలో భాగంగా ప్రస్తుత శివసేన అధ్యక్షుడు, ఉద్ధవ్ ఠాక్రే తరఫు లాయర్ రోహిత్ కపాడియా జయ్ దేవ్ ను కొన్ని ప్రశ్నలు వేశారు. జయ్ దేవ్ కు ఆస్తిపై ఎటువంటి హక్కూలేదని, తన ఇష్ట ప్రకారమే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు బాల్ ఠాక్రే వీలునామా చేసిన విషయం తెలిసిందే. కాగా ఐశ్వర్యకు ఠాక్రే నుంచి వారసత్వ సంపద దక్కడంపై జయ్ దేవ్ కోర్టుకెక్కారు. బాంద్రాలోని మఠోశ్రీ బాల్ ఠాక్రే నివాసంలో 2004కు ముందు రెండో అంతస్తులో తాను నివసించినట్లు జయ్ దేవ్ తెలిపారు. మొదటి అంతస్తులో ఎవరు నివసించేవారు? అని లాయరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ఎప్పుడూ తలుపుల మూసేసి ఉండేవని, అప్పుడప్పుడు తెరచి ఉండేవని చెప్పారు. బాల్ ఠాక్రేను ఈ విషయం గురించి అడుగగా ఐశ్వర్య ఉంటున్నాడని చెప్పారని తెలిపారు.

మరి ఐశ్వర్యను బాల్ ఠాక్రే తన తనయుడని మీకు చెప్పారా? అని లాయరు ప్రశ్నించారు. ఇందుకు సమాధానం ఇచ్చిన జయ్ దేవ్ ఆయన అలా చెప్పలేదని తెలిపారు. ఐశ్వర్యకు సంబంధించిన వివరాలను తాను సేకరించాలని ప్రయత్నించానని కానీ అవకాశం రాలేదని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి గత విచారణల్లో 1999లో తల్లి స్మితతో మనస్పర్దలు రావడం వల్ల ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయినట్లు చెప్పారు. 2004లో ఠాక్రేతో విడాకులు తీసుకునేంత వరకూ స్మిత మఠోశ్రీలోనే ఉన్నట్లు కోర్టుకు చెప్పారు. 1999-2004 మధ్య కాలంలో అప్పుడప్పుడు తన తండ్రి ఠాక్రేను కలిసేందుకు వెళ్లి రాత్రికి తిరిగి తన ఫ్లాట్ కు చేరుకునేవారని తెలిపారు. 2012 నవంబర్ లో ఠాక్రే మరణించే ఒక నెల ముందు వరకూ ఆయన్ను కలవడం ఆపలేదని చెప్పారు.

మరిన్ని వార్తలు