మంత్రిగారి ఫోన్లో ఇంతకీ ఏముంది?

17 Feb, 2016 08:59 IST|Sakshi
మంత్రిగారి ఫోన్లో ఇంతకీ ఏముంది?

కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తన ఫోన్లో ఓ వీడియోను ముగ్గురు ప్రతిపక్ష నేతలకు చూపిస్తున్న ఫొటో మీడియాలో హల్‌చల్ సృష్టిస్తోంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు త్వరలో ప్రారంభం కానుండటంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశం సందర్భంగా వీళ్లంతా ఒకచోట ఉన్నప్పుడు ఎవరో ఈ ఫొటో తీశారు. పార్లమెంటును సజావుగా నడిపించేందుకు విపక్షాలు సహకరించాలని కోరడానికి ప్రధాని ఈ సమావేశం ఏర్పాటు చేశారు.

సమావేశం తర్వాత రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ బయటకు వచ్చారు. మీడియాతో మాట్లాడేందుకు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. అంతలో ఆర్థికమంత్రి ఆరుణ్ జైట్లీ, సీపీఐ నేత డి.రాజా కూడా బయటకు వచ్చారు. ఆ వెంటనే కేంద్ర మాజీమంత్రి ఆనంద్ శర్మ వచ్చారు. వాళ్లు ముగ్గురూ ఏదో మాట్లాడుకుంటుంటే ఆజాద్ అడ్డంగా చెయ్యి ఊపడం, రాజా మాత్రం అవునన్నట్లు తల ఊపడం కనిపించాయి. అంతలో జైట్లీ తన ఐఫోన్ 6ఎస్ బయటకు తీశారు. స్క్రీన్ మీద కాసేపు టక టకా టచ్ చేసి.. ఏదో వీడియో చూపించారు. కాసేపటికి జైట్లీ ఆ వీడియోను ఆపి.. ఫోన్ జేబులో పెట్టుకుని ఆజాద్, ఆనంద్ శర్మల వైపు చూశారు. ఆజాద్ తల ఆడించగా, ఆనంద్ శర్మ మాత్రం ఏదో ఆలోచిస్తున్నట్లు గడ్డం గోక్కున్నారు. తర్వాత మీడియాతో మాట్లాడిన ఆజాద్.. కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లోనూ జాతివ్యతిరేక నినాదాలు ఇచ్చేవారికి, రాజ్యాంగాన్ని సవాలుచేసేవారికి మద్దతు ఇవ్వబోదని ప్రకటించారు.

>
మరిన్ని వార్తలు