చిచ్చురేపిన వాట్సప్‌ మెసేజ్‌.. ఊరంతా ఉద్రిక్తం

7 May, 2017 15:27 IST|Sakshi
చిచ్చురేపిన వాట్సప్‌ మెసేజ్‌.. ఊరంతా ఉద్రిక్తం

- ఇరువర్గాల ఘర్షణ.. ఉట్నూరులో రణరంగం
- పోలీసులపైకి రాళ్లు రువ్విన అల్లరిమూక.. టియర్‌ గ్యాస్‌ ప్రయోగం
- ఎస్సీ, ఏఎస్పీ, డీఎస్పీలకు గాయాలు.. 144 సెక్షన్‌ విధింపు


ఉట్నూరు (ఆదిలాబాద్‌ జిల్లా):
ఉట్నూరు మండల కేంద్రంలో ఆదివారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఓ యువకుడు వాట్సప్‌లో ఓ వర్గాన్ని కించపరుస్తూ 8 నిమిషాల నిడివి గల వాయిస్‌ మెసేజ్‌  పోస్టు చేశాడు. అతడు పెట్టిన పోస్టింగ్‌ పెద్ద గొడవకు తెరలేపింది. తమ వర్గాన్ని కించపరిచిన యువకుడిని అరెస్టు చేయాలని ఆ వర్గం వారు రోడ్లపై ఆందోళనకు దిగారు. అదే సమయంలో అవతలి వర్గం వారు కూడా పెద్ద సంఖ్యలో గుమిగూడి ఆందోళనకు దిగారు.

టియర్‌ గ్యాస్‌ ప్రయోగం.. రాళ్ల వర్షం..
పోలీసులు నచ్చజెప్పినా ఫలితం లేకపోవడంతో అల్లరిమూకలను తరిమి కొట్టేందుకు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. దీంతో రెచ్చిపోయిన రెండువర్గాలూ రాళ్లు విసురుకోవడంతో కొంతమంది పోలీసులతో పాటు మరికొంత మంది ప్రజలకు గాయాలయ్యాయి. ఉన్నట్టుండి చెలిరేగిన ఈ హింసతో ఉట్నూరు మండల కేంద్రంలో దుకాణాలు మూతపడ్డాయి. ప్రస్తుతం ఉట్నూరులో 144 సెక్షన్‌ అమలులో ఉంది.  

పోలీసు ఉన్నతాధికారులకూ గాయాలు..
అల్లరి మూకలు జరిపిన దాడిలో జిల్లా ఎస్పీ, డీఎస్పీలకు కూడా గాయాలయ్యాయి. కలెక్టర్‌ బుద్ధ ప్రసాద్‌ ఆదేశాల మేరకు డీఐజీ రవి వర్మ సంఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అల్లరిమూకలు పోలీసులపైకి రాళ్లురువ్వడానికి గర్హించిన ఆయన.. తప్పు చేసిన ఎవ్వరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు