విలేకరులపై చిటపటలాడిన హీరోయిన్‌!

6 Aug, 2016 20:18 IST|Sakshi
విలేకరులపై చిటపటలాడిన హీరోయిన్‌!

'కల్‌ హో నా హో' సినిమాతో 16 ఏళ్ల కిందట హృతిక్‌ రోషన్‌, అమీషా పటేల్‌ బాలీవుడ్‌కు పరిచయమయ్యారు. హీరోగా హృతిక్‌ తన ప్రస్థానం కొనసాగిస్తుండగా.. 'బద్రి' తార అమీషా మాత్రం కెరీర్‌ పరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నది. దాదాపు మూడేళ్ల తర్వాత 'భయ్యాజీ సూపర్‌హిట్‌' సినిమాతో ఆమె వెండితెరను పలుకరించబోతున్నది.

తాజాగా 'భయ్యాజీ సూపర్‌హిట్‌' చిత్రయూనిట్‌ ప్రెస్‌మీట్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా సహనం కోల్పోయిన అమీషా విలేకరులపై తీవ్రస్థాయిలో మండిపడిందట. ముంబై మీడియా కథనం ప్రకారం చిటపటలాడుతూ ఈ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న అమీషా.. విలేకరులు కుర్చీలలో కూర్చుంటుడగానే 'సైలెన్స్‌' అంటూ గద్దించింది.

మూడేళ్లుగా ఎందుకు సినిమాల్లో నటించడం లేదని ఓ విలేకరి అడుగగా.. 'నన్ను అమీషా అని కాదు.. అమీషాజీ అని పిలువండి' అంటూ గట్టిగా సూచించింది. అదేవిధంగా మీరు చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారా? అని అడిగిన విలేకరిపైనా ఆమె ఆగ్రహం ప్రదర్శించింది. మీకు మెదడు ఉందా? అంటూ ఆ విలేకరిపై విరుచుకుపడింది అమీషా.

ఈ ప్రెస్‌మీట్‌ గురించి చిత్రయూనిట్‌ ముందుగానే తెలుపలేదట. దీంతో ఈ సినిమాలో నటిస్తున్న మరో నటి ప్రీతి జింతా ప్రెస్‌మీట్‌కు డుమ్మ కొట్టగా.. అమీషా తన ఆగ్రహాన్ని విలేకరులపై చూపిందని చిత్రవర్గాలు అంటున్నాయి. సన్నీ డియోల్‌, అర్షద్‌ వార్సీ, ప్రీతి జింతా, అమీషా పటేల్‌, శ్రేయస్ తల్పాడే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'భయ్యాజీ సూపర్‌హిట్‌' సినిమాపై ఒకప్పటి బాలీవుడ్‌ హీరోయిన్లు అయిన అమీషా, ప్రీతి భారీ అంచనాలే పెట్టుకున్నారు.
 

మరిన్ని వార్తలు