వైట్‌కాలర్‌ నేరాలు గుర్తించడం కష్టమే

25 May, 2017 08:44 IST|Sakshi

న్యూఢిల్లీ: సమాజంలో గౌరవ, మర్యాదలు పొందే వ్యక్తులు పాల్పడే నేరాల(వైట్‌కాలర్‌ నేరాలు)ను  గుర్తించడం కష్టమేనని ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు అభిప్రాయపడింది. పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారుల పాత్ర ఉన్నట్లు భావిస్తున్న బొగ్గు కుంభకోణాన్ని ప్రస్తావిస్తూ ఇలా పేర్కొంది. బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి హెచ్‌సీ గుప్తా, మరో ఇద్దరు సీనియర్‌ అధికారులు కేఎస్‌ క్రోఫా, కేసీ సమారియాలను కోర్టు ఈ కేసులో దోషులుగా నిర్ధారిస్తూ రెండేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.

ప్రజల నైతిక స్థైరాన్ని దెబ్బతీసే వైట్‌కాలర్‌ నేరాలు, సాధారణ నేరాల కన్నా ప్రమాదకరమని కోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి నేరాలు అధిక ఆర్థిక నష్టాలను కలిగించడమే కాకుండా అందరి దృష్టిని ఆకర్షిస్తాయని జడ్జి భరత్‌ పరాశర్‌ అన్నారు. వైట్‌కాలర్‌ నేరాలకు పాల్పడేవారు ఎగువ ఆర్థిక, సామాజిక తరగతికి చెందినవారని, తమ వ్యక్తిగత లేదా వృత్తిపర విధుల్లో చట్టాలను ఉల్లంఘిస్తున్నారని తెలిపారు. ఎంతో ఆలోచించి, పక్కా ప్రణాళికతో చేయడం వల్ల వైట్‌కాలర్‌ నేరాలను పసిగట్టడం అత్యంత కష్టమని అన్నారు.

మరిన్ని వార్తలు