మీనాక్షి.. ఎంతపని చేసింది!

12 Oct, 2016 09:16 IST|Sakshi
దవాఖానలో చికిత్స పొందుతున్న జితేంద్ర

మొరాదాబాద్: ఇద్దరు పరాయి పురుషులతో కలిసి ఉండగా చూసి, గోలచేశాడని భర్త నాలుకను కోసిపారేసిందో భార్య! ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ లో జరిగిన ఈ సంఘటన వివరాలను మొదరాబాద్ పోలీసులు మీడియాకు చెప్పారు. వారి కథనం ప్రకారం..

సంబల్ పట్టణానికి చెందిన జితేంద్ర అనే యువకుడు కొద్ది రోజుల కిందట తన భార్య మీనాక్షితో కలిసి మొరాదాబాద్ కు వలస వచ్చాడు. ఇటుకబట్టీల్లో కూలీగా పనిచేసే అతను.. ఓ ఇంట్లో అద్దెకుంటున్నాడు. ఆదివారం రాత్రి పని ముగించుకుని ఇంటికి వచ్చిన జితేంద్ర.. తన ఇంటి బెడ్ రూమ్ లో దృశ్యాన్ని చూసి షాక్ అయ్యాడు. ఇద్దరు పరాయి మగవాళ్లతో మీనాక్షి దగ్గరగా ఉండటాన్ని చూసి.. వారిపై దాడికి యత్నించాడు. అంతలోపే మీనాక్షి, అతని ప్రియులు కలిసి జితేంద్రను బంధించారు. పదునైన చాకుతో మీనాక్షి తన భర్త నాలుకను కోసేసింది. తర్వాత ముగ్గురూ అక్కడి నుంచి తప్పించుకున్నారు. కొద్దిసేపటికి రక్తం మడుగులో పడిఉన్న జితేంద్రను ఇరుగుపొరుగువారు గుర్తించి ఆసుపత్రికి తరలించారు.

జితేంద్రకు ఆపరేషన్ నిర్వహించిన వైద్యులు తొమ్మిది కుట్లువేసి నాలుకను సరిచేశారు. ఫిర్యాదుమేరకు రంగంలోకి దిగిన పోలీసులు జితేంద్ర కుటుంబసభ్యులను పిలిపించారు. మీనాక్షికి పెళ్లికి ముందే చాలామందితో సంబంధాలున్నాయని, పెళ్లయ్యాక కూడా విచ్చలవిడిగా ప్రవర్తించేదని, సొంత ఊళ్లో పరువు కాపాడుకునేందుకే మీనాక్షిని తీసుకుని జితేంద్ర మొరాదాబాద్ వచ్చాడని, అయినా కూడా ఆమె మారలేదని బాధితుడి బంధువులు పోలీసులకు చెప్పారు. పరారీలో ఉన్న ముగ్గురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు