భర్త కోసం ఎన్నికల ప్రచారానికి వెళ్తే..

31 Jan, 2017 16:08 IST|Sakshi
భర్త కోసం ఎన్నికల ప్రచారానికి వెళ్తే..
భర్త కోసం ఎన్నికల ప్రచారానికి వెళ్తే భార్యకు చేదు అనుభవం ఎదురైంది. తన భర్త, కాంగ్రెస్ అభ్యర్థి కమల్జీత్ సింగ్ కర్వల్ తరఫున ఇంటింటి ప్రచారానికి వెళ్లిన కోమల్‌ప్రీత్ కౌర్ మీద మోటార్ సైకిల్ మీద వచ్చిన ఇద్దరు దుండగులు దాడి చేశారు. దుర్గి పట్టణంలోని బసంత్ విహార్ ప్రాంతంలో ప్రచారం చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో కోమల్‌ప్రీత్‌కు ఎలాంటి గాయాలు కాకుండా తప్పించుకున్నారు. లోక్ ఇన్సాఫ్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుదారులే ఈ దాడి చేసినట్లు అతమ్ నగర్ స్థానం నుంచి పోటీ చేస్తున్న కమల్జీత్ సింగ్ కర్వల్ ఆరోపించారు. తాను తన వదిన, మరికొందరు కాంగ్రెస్ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం చేస్తుండగా వాళ్లొచ్చి దాడి చేశారని కోమల్‌ప్రీత్ చెప్పారు. 
 
ఉదయం 9.30 గంటలకు ఆమె తన కారులో కూర్చుని ఉండగా ఇద్దరు యువకులు వచ్చి కారును వెనక నుంచి ఢీకొని, పదునైన ఆయుధంతో దాడిచేసి, అక్కడినుంచి పారిపోయారు. కాసేపటికి అక్కడకు వచ్చిన కమల్జీత్ సింగ్ పోలీసులకు విషయం చెప్పారు. దుండగులు వచ్చిన మోటార్ సైకిల్ మీద సిమర్జీత్ సింగ్ బైన్స్ ఎన్నికల గుర్తు అయిన పోస్టాఫీసు ఉందని, దాని తాను చూశానని కోమల్‌ప్రీత్ చెప్పారు. ఆయన ఆప్-ఎల్ఐపీ పార్టీల సంయుక్త అభ్యర్థి. ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే ప్రత్యర్థులు ఈ దాడి చేశారన్నారు. పోలీసులు సమీపంలోని బేకరీలో ఉన్న సీసీటీవీ కెమెరా నుంచి ఫుటేజి తీసుకుని పరిశీలించగా, మోటార్ సైకిల్ మీద వచ్చిన ఇద్దరు దుండగులు కారు వెనక అద్దం పగటగొట్టి పారిపోయినట్లు అందులో రికార్డయింది.