పెళ్లిపెద్దపై నిప్పులు చెరిగిన డింపుల్ యాదవ్

3 Mar, 2017 11:33 IST|Sakshi
పెళ్లిపెద్దపై నిప్పులు చెరిగిన డింపుల్ యాదవ్
తనకు అఖిలేష్ యాదవ్‌తో దగ్గరుండి పెళ్లి చేయించిన పెళ్లిపెద్ద అమర్‌సింగ్ మీద సీఎం భార్య డింపుల్ యాదవ్ నిప్పులు చెరిగారు. అలాంటి మనుషుల మాటలను తాను లెక్కచేసేది లేదని స్పష్టం చేశారు. కనీసం తన పిల్లలను టీవీలో కూడా అమర్ సింగ్ ముఖం చూడనిచ్చేది లేదని తెగేసి చెప్పారు. ఈసారి ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ గెలుస్తుందని తాను ఒకసారి ములాయం సింగ్ యాదవ్‌కు చెప్పినట్లు అమర్ సింగ్ అన్న విషయాన్ని ప్రస్తావించగా, అలాంటి మనుషులను తాను పట్టించుకోనని, టీవీలో ఆయన ముఖం వస్తే వెంటనే టీవీ కట్టేస్తానని, తన పిల్లలకు కూడా ఆయన ముకం టీవీలో చూపించబోనని డింపుల్ అన్నారు. 
 
అఖిలేష్ యాదవ్‌కు, ఆయన తండ్రి ములాయంకు మధ్య తగాదాలకు అమర్ సింగే ప్రధాన కారణమన్న వాదన ఒకటి ఉంది. అమర్‌ను మళ్లీ పార్టీలోకి తీసుకోవడాన్ని అఖిలేష్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాతే పార్టీలో ముసలం మొదలైంది. మైనర్‌పై సామూహిక అత్యాచారం చేశారన్న ఆరోపణలున్న గాయత్రీ ప్రజాపతిని కాపాడేందుకు సమాజ్‌వాదీ పార్టీ ప్రయత్నిస్తున్న విషయాన్ని ఆమెను అడగ్గా.. అది వాస్తవం కాదని, తాము చట్టాన్ని గౌరవిస్తామని, నేరం చేసినవాళ్లు ఎవరైనా జైలుకు వెళ్లాల్సిందేనని అన్నారు. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. 
మరిన్ని వార్తలు