సీఎం బుగ్గపై ముద్దుపెట్టిన మహిళ

26 Jun, 2016 15:38 IST|Sakshi
సీఎం బుగ్గపై ముద్దుపెట్టిన మహిళ

బెంగళూరు: ఓ ప్రజా కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బుగ్గలపై ఓ మహిళ బహిరంగంగా ముద్దుపెట్టింది. ఆదివారం బెంగళూరులో కురుబా సామాజిక వర్గం ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమం జరిగింది. సీఎం సిద్ధరామయ్య కురుబా కులానికి చెందినవారు కావడంతో ఆయన కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిక్‌మగ్‌లూరు జిల్లా తారికెర్ తాలూకా పంచాయతీ సభ్యురాలైన గిరిజా శ్రీనివాస్‌ను ఆయన సన్మానించారు. సన్మానం ముగిసిన వెంటనే ఆమె ఆయన కుడిబుగ్గపై ముద్దుపెట్టారు. దీంతో సిద్ధరామయ్య కొంత ఇబ్బందిపడ్డట్టు కనిపించారు.

ఈ ఘటనపై ఆయన స్పందించేలోగా ఆమె వేదిక నుంచి దిగిపోయారు. అనంతరం స్థానిక మీడియాతో ఆమె మాట్లాడుతూ 'సిద్ధరామయ్య నా తండ్రిలాంటివారు. ఆయనను నేను తొలిసారి కలిశాను. ఆ సంతోషంలో ఆయనకు ముద్దుపెట్టాను. ఇందులో ఎలాంటి తప్పు లేదు' అని చెప్పారు. తనది సిద్ధరామయ్య నియోజకవర్గమేనని, తనకు పెళ్లి అయిందని ఆమె తెలిపారు.

మరిన్ని వార్తలు