ఆమెతో జాగ్రత్త

27 Nov, 2015 12:53 IST|Sakshi
ఆమెతో జాగ్రత్త
  • ఎవరైనా ఒంటరిగా కనిపిస్తే దౌర్జన్యం
  • చిన్నప్పటి నుంచి నేరస్వభావం
  • విజయవాడ : ఆమె ఆజానుబాహురాలు.. ఆరడుగుల ఎత్తు... పేరు శీలం శిరీష (35) ఆమె రౌడీయిజం చేస్తుందంటే ఎవరూ నమ్మరు. నగరం నడిబొడ్డున బెంజిసర్కిల్లో రాత్రి ఎనిమిది గంటల నుంచి ఆర్థరాత్రి ఒంటిగంట వరకు తిరుగుతూ ఒంటిరిగా ఎవరైనా కనిపిస్తే బెదిరించి నగలు, నగదుతోపాటు ఇతర వస్తువులు దోచుకుంటుంది. కాదని ఎవరైనా అడ్డం తిరిగితే చావబాది వస్తువులు లాక్కుని పరారవుతుంది. 20 ఏళ్ల వయసు నుంచి దౌర్జన్యాలకు పాల్పడుతూ మహిళల మెడల్లో గొలుసులు కూడా లాక్కుపోతుండేది.

    ఈమెపై పోలీసులు  మూడు కేసులు నమోదు చేశారు. దౌర్జన్యాలు, రౌడీయిజం, అధికారినని చెప్పి బెదిరించి డబ్బు వసూలు చేసిన సంఘటనలపై కేసులున్నాయి. నవ్యాంధ్రప్రదేశ్లో మొదటి మహిళా రౌడీషీటర్గా పేరు నమోదు చేసుకుంది. గతేడాది ఈమెపై పోలీసులు రౌడీషీట్ తెరిచారు. ప్రతినెలా మాచవరం పోలీస్ స్టేషన్కి వచ్చి సంతకం చేసి వెళ్తుంది. నగరంలో ఎక్కడ ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. పోలీసులు కూడా ఆమె ఎక్కడుంటుందో చెప్పలేకపోతున్నారు.

    మొదటి నుంచి నేర స్వభావమే....
    కృష్ణాజిల్లా కంకిపాడు మండలంలోని ఈడ్పుగల్లు ఈమె స్వగ్రామం. పేర్లు. ఇంటిపేర్లు, కులం మార్చి చెప్పి మోసాలు, దౌర్జన్యాలు చేయటం ఈమెకు అలవాటు. తల్లిదండ్రులు చెప్పినా వినిపించుకునేది కాదు. పదో తరగతి వరకు చదువుకుంది. పోలీస్ రికార్డుల్లో ఆమె భర్త పేరు సురేష్గా నమోదైంది. ఎనిమిదేళ్ల కిందట పెళ్లయిందని, భర్త చనిపోయాడని... ఇద్దరు పిల్లలున్నారని ఆమె చెబుతోంది.

    పోలీసుల కథనం వేరే...
    ఈమెకు భర్తలేడు. పెళ్లి కాలేదు. పిల్లలు లేరు. చెప్పేవన్నీ అబద్దాలు. ఒకచోట ఉండటం లేదు. కొన్నిసార్లు కంకిపాడు, రామవరప్పాడులో ఉంటున్నానని, మరికొన్ని సార్లు కృష్ణలంకలో ఉంటున్నానని చెబుతున్నట్లు మాచవరం పోలీస్ స్టేషన్ ఎస్హెచ్వో తెలిపారు. మద్యం సేవించి తిరుగుతుందని, ఒంటరిగా కనిపించేవారిపై దౌర్జన్యం చేస్తుందని చెబుతున్నారు.

    మహిళలు దందాలు చేస్తున్న అడ్డాలు ఇవే...
    నగరానికి కొత్తగా వచ్చే వారిని, మద్యం మత్తులో ఉన్నవారిని లక్ష్యంగా చేసుకొని మహిళలు దందాలు చేస్తున్న అడ్డాలు పలు ఉన్నాయి. అడపా, దడపా ఫిర్యాదులు వచ్చినప్పుడు పోలీసులు దాడులు చేసి కొందరిని అరెస్ట్ చేస్తున్నారు తప్ప పూర్తిస్థాయిలో నిలువరించే చర్యలు మాత్రం శూన్యం. బెంజిసర్కిల్, పాత బస్స్టాండ్, లోబ్రిడ్జి, కళాక్రేతం, అగ్నిమాపక కేంద్రం ప్రధాన కార్యాలయం సమీపంలో రాత్రి 11.00 గంటలు దాటిన తర్వాత మహిళలు వేచి ఉంటూ వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఆటోనగర్లోని పలు ప్రాంతాల్లో రాత్రి వేళల్లో చౌకబారు వ్యభిచారం జోరుగా సాగుతోంది. ఇక్కడికి వెళ్లే వారిని బెదిరించి మహిళలు అందినకాడికి దోచుకుంటున్నారు.

మరిన్ని వార్తలు