మగబిడ్డ కోసం బలవంతం.. భర్త హత్య!

25 Mar, 2017 12:29 IST|Sakshi
మగబిడ్డ కోసం బలవంతం.. భర్త హత్య!

న్యూఢిల్లీ: మగబిడ్డ కోసం దుర్మార్గంగా వ్యవహరించిన ఓ వ్యక్తిని అతని భార్య చంపేసిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. తన వారసత్వాన్ని, కుటుంబవ్యాపారాన్ని కొనసాగించేందుకు తనకు మగబిడ్డ కావాలని, ఇందుకోసం సోదరుడితో గడుపాల్సిందిగా ఆ వ్యక్తి భార్యపై ఒత్తిడి తెచ్చాడు. అందుకు భార్య నిరాకరించడంతో ఆమెను చితకబాదాడు. ఆమెపై సామూహిక అత్యాచారం జరిపిస్తానని, ఆమెను వేశ్యగృహాలకు అమ్మేస్తానని బెదిరించాడు. ఆ దంపతులకు ఒక కూతురు ఉంది. మగబిడ్డ కోసం పలుసార్లు బాధితురాలికి అబార్షన్‌ చేయించాడు. ఈ క్రమంలో ఏడాదిపాటు అతని వేధింపులు భరించిన ఆమె.. గత ఆదివారం సహనం కోల్పోయి భర్తను చంపేయాలని నిర్ణయించుకుంది. భర్త తాగిన పానీయంలో నిద్రమాత్రలు కలిపి.. అతడు నిద్రపోయిన తర్వాత ఊపిరాడకుండా చేసి చంపేసింది.

ఈ మరునాడు పోలీసులకు ఫోన్‌ చేసి తన భర్త హత్యకు గురయ్యాడని, ఇంటికి వచ్చిన అతిథులు అతన్ని చంపి ఉంటారని చెప్పింది. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు ఆమె అల్లిన కథనాన్ని పోలీసులు చివరకు ఛేదించారు. హత్య జరిగిన రోజు రాత్రి మూడు గంటలసమయంలో ఆమె ఇంటికి ఆమె సోదరుడు వచ్చిన విషయాన్ని సీసీటీవీ కెమెరా దృశ్యాల ద్వారా ధ్రువీకరించిన పోలీసులు.. ఈ దృశ్యాల ఆధారంగా విచారించడంతో తామే పథకం ప్రకారం అతన్ని చంపామని ఆమె పోలీసులు ముందు అంగీకరించారు. ఆమెను, ఆమె సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు.

ఈ సందర్భంగా తన 18 ఏళ్ల వైవాహిక జీవితంలో భర్త చేతిలో ఎలాంటి హింసను, క్షోభను అనుభవించిందో వివరించింది. మగబిడ్డ కోసం పెళ్లయిన కొన్నేళ్ల నుంచే వేధించడం మొదలుపెట్టాడని, తమ మొదటి బిడ్డ పుట్టిన నాలుగేళ్లకే పౌష్టికాహార లోపంతో మరణించిందని, ఆ తర్వాత పలుసార్లు గర్భం దాల్చినా.. మగబిడ్డ కాదని పరీక్షల్లో తేలడంతో అబార్షన్లు చేయించాడని ఆమె వివరించింది. చివరకు సోదరుడితోనే గడుపాల్సిందిగా తనపై ఒత్తిడి తేవడం మొదలుపెట్టాడని, దీనితో సహనం కోల్పోయి హత్య చేసినట్టు ఆమె తెలిపిందనిపోలీసులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు