వేరు కాపురం పెట్టలేదనే కోపంతో..

16 Sep, 2017 21:18 IST|Sakshi

అన్నానగర్‌(చెన్నై): వేరు కాపురం పెట్టడానికి భర్త అంగీకరించలేదన్న మనస్తాపంతో భార్య తన ఇద్దరు పిల్లలతో సహ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన తమిళనాడులోని కొయంబత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలివి.. జిల్లాలోని ఊత్తుక్కులీ ప్రాంతానికి చెందిన రాజేశ్‌(28) తిరుప్పూర్‌లో బట్టల వ్యాపారం చేస్తున్నాడు. అతని భార్య విద్య(26). వీరికి పవన్‌, పవేష్‌ అనే ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. రాజేష్‌ తల్లిదండ్రులు కూడా వీరితోనే  ఉంటున్నారు.

వేరు కాపురం పెడుదామని విద్య కోరిన భర్త అందుకు అంగీకరించలేదు.  ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం విద్య ఇద్దరి పిల్లలతో బెడ్‌ రూంలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. నిద్రపోతున్నారని అత్త భావించింది.  సాయంత్రం ఇంటికి వచ్చిన రాజేష్‌ గది తలుపుతట్టాడు. అయినా తలుపు తీయకపోవడంతో పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా విద్య ఫ్యాన్‌కు ఉరివేసుకుని వేలాడుతోంది. మంచం మీద ఉన్న పిల్లలను చూస్తే వారిలో ఎలాంటి చలనం లేదు.

ముగ్గురినీ ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి తల్లీబిడ్డలు మృతిచెందారని ధ్రువీకరించారు. విద్య పిల్లలను హత్య చేసి తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి విచారించారు. బెడ్‌ రూంలో దొరికిన విద్య రాసిన ఉత్తరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని రాజేష్‌ను విచారిస్తున్నారు.

మరిన్ని వార్తలు