ఒకవైపు మహిళల మీద అఘాయిత్యాలు పెరిగిపోతుంటే, మరో స్వామీజీ మహిళల గురించి దారుణమైన వ్యాఖ్యలు చేశారు. హిందూ మహాసభ అధ్యక్షుడైన స్వామి ఓంజీ మహరాజ్ ఈ వివాదానికి కారణమయ్యారు. న్యూస్రూం అనే ప్రైమ్టైమ్ షోలోని ప్యానలిస్టులలో ఒకరైన ఈయన... మన దేశంలో మహిళలు ధరిస్తున్న దుస్తుల వల్లనే వారిమీద లైంగిక దాడులు జరుగుతున్నాయని అన్నారు.
పొట్టి స్కర్టులు వేసుకోవడం వల్ల వాళ్లు ఇబ్బందులను కొనితెచ్చుకుంటున్నారని, బురఖాలో ఉన్నవాళ్లయితే సురక్షితంగా ఉంటారని చెప్పుకొచ్చారు. అమ్మాయిలు ఒంటినిండా దుస్తులు కప్పుకోకపోతే.. బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్లుగా లైంగిక దాడులు చేసేవాళ్లు వాళ్ల చుట్టూ చేరుతారని హెచ్చరించారు. బెంగళూరులో కొత్త సంవత్సరం రోజున జరిగిన ఘటనపై దేశవ్యాప్తంగా పలువురు సెలబ్రిటీలు, ప్రముఖులు తీవ్రంగా మండిపడుతున్న తరుణంలోనే ఈయన ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
మరోవైపు సమాజ్వాదీ పార్టీ నాయకుడు అబు అజ్మీ కూడా దాదాపు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ''పెట్రోలు ఉంటే మంట వస్తుంది.. పంచదార ఉంటే చీమలు చేరుతాయి'' అని అమ్మాయిలే ఈ తరహా లైంగిక దాడులకు కారణమన్నట్లుగా ఆయన చెప్పారు. ఆధునిక కాలంలో ఎంతగా ఒళ్లు చూపిస్తే అంత ఫ్యాషన్ అని అమ్మాయిలు అనుకుంటున్నారని, డిసెంబర్ 31వ తేదీ సూర్యాస్తమయం అయిన తర్వాత సోదరుడు లేదా భర్త కాకుండా మరో మగాడితో తన సోదరి లేదా కూతురు కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకొంటుంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోనని ఆయన స్పష్టం చేశారు.