గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి తాము మద్దతిచ్చే ప్రసక్తి లేనే లేదని ఫైర్బ్రాండ్ నాయకురాలు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కుండ బద్దలుకొట్టారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా జరిగిన ఓ ర్యాలీలో ఆమె ప్రసంగిస్తూ ఈ విషయం తెలిపారు.
అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంపై కూడా ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వాళ్లు పదేళ్లుగా దేశాన్ని పాలిస్తున్నారని, ఇన్నాళ్లూ ఎప్పుడూ మోడీ గురించి మాట్లాడకుండా, ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి.. ఆయనను టార్గెట్ చేసుకుంటున్నారని అన్నారు. తమకు ఓట్లు వేయకపోతే మోడీ ప్రధాని అవుతారంటూ ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
పార్లమెంటులో బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర పోషించడంలో బీజేపీ విఫలమైందని, వాస్తవానికి అసలు కాంగ్రెస్- బీజేపీల మధ్య శత్రుత్వమే లేదని మమత అన్నారు. హిందూ ముస్లింలను విభజించే రాజకీయాలే బీజేపీ చేస్తోందని ఆమె ఆరోపించారు. కానీ వాళ్లు అటు హిందువుల, ఇటు ముస్లింల ప్రయోజనాలు రెండింటినీ పట్టించుకోవట్లేదని ఎద్దేవా చేశారు.