కాబోయే భర్తే హంతకుడు!!

16 Jan, 2015 19:06 IST|Sakshi
కాబోయే భర్తే హంతకుడు!!

గుజరాత్లోని అహ్మదాబాద్ నగరంలో జరిగిన యువతి హత్యకేసు కొత్త మలుపు తిరిగింది. కొంతమంది తాగుబోతులు ఆమెను పొడిచి చంపినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యక్తే.. అంటే, ఆమెకు కాబోయే భర్తే సదరు యువతిని చంపినట్లు పోలీసులు తెలిపారు. మహారాష్ట్రలోని రాయగఢ్ ప్రాంతానికి చెందిన బీర్బల్ ప్రసాద్ (26)కు అహ్మదాబాద్ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో నిశ్చితార్థం జరిగింది. అయితే, కొన్నాళ్ల తర్వాత ఆమె తండ్రి ఆ సంబంధం వద్దనుకున్నారు.

అయినా బీర్బల్ ప్రసాద్ ఆమెతో స్నేహాన్ని కొనసాగిస్తున్నాడు. ఈనెల 14వ తేదీ రాత్రి తాను ఆమెతో కలిసి ఉండగా కొంతమంది తాగుబోతులు వచ్చి ఆమెపై అత్యాచారం చేయబోయారని, తాము అడ్డుకోగా ఇద్దరిపైనా కత్తులతో దాడి చేశారని అతడు పోలీసులకు ఫిర్యాదుచేశాడు. అయితే.. విచారణలో అసలు విషయం తేలింది. ప్రసాద్ వద్ద సూసైడ్ నోట్ లభించింది. దాంతో, ముందుగా ఆమెను హతమార్చి, ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకోడానికి అతడు ప్రయత్నించాడని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మనోజ్ అగర్వాల్ తెలిపారు. ఆమె తల్లిదండ్రులు తనను అవమానించినందువల్లే ప్రతీకారం తీర్చుకోడానికి బీర్బల్ ఈ హత్యకు పాల్పడినట్లు చెప్పారు. ఆమెను చంపిన తర్వాత తనను తాను పొడుచుకున్నా, అతడి ప్రాణాలు మాత్రం దక్కాయి. దాంతో కథ మార్చి, నలుగురు యువకులు దాడిచేసినట్లు అల్లాడు. అతడు ఇంకా చికిత్స పొందుతున్నాడు.

మరిన్ని వార్తలు