ఏమయిందో ఏమో ..

30 Aug, 2016 23:03 IST|Sakshi
ఏమయిందో ఏమో ..

సోంపేట: శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం గుండా వెళ్లే జాతీయ రహదారిపై గల బేసిరామచంద్రాపురం గ్రామ సమీపంలో గుర్తుతెలియని యువతి మృతదేహం లభించిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఆ మృతదేహం ఒడిశాలోని చత్రపురం గ్రామానికి చెందిన తృప్తిమయి పండా(23)గా గుర్తించారు. రెండు బృందాలుగా ఏర్పడిన దర్యాప్తు అధికారులు.. ఈనెల 26న యువతి అదృశ్యమైనట్లు బివేకానంద పండా, స్వర్ణమయు దంపతులు బరంపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేసినట్లు గుర్తించారు. ఆ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లిన పోలీసులు.. సోంపేటలో మరణించిన యువతి ఫొటోలను చూపించగా అది తమ కూతురిదేమోననే అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు వారిని సోంపేట పట్టణాని తీసుకొచ్చారు. మృత దేహాన్ని పరిశీలించి.. తమ కుమార్తెనే అని నిర్థారణ చేశారు.

మృతురాలు ఎంసీఏ విద్యార్థిని
ఒడిశాలోని చత్రపురం పోలీస్ క్వార్టర్స్ లో నివసించే కుటుంబంలో కలిసి నివసించే తృప్తిమయి పది రోజుల కిందటే బరంపురంలోని కళ్లికోట్ కళాశాలలో ఎంసీకే ఫస్ట్ ఇయర్ లో చేరింది. అక్కడే ఓ ప్రైవేటు హాస్టల్ లో ఉంటూ కాలేజీకి వెళుతోంది. అయితే ఈ నెల 25న గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి ఆమెను బయటికి తీసుకెళ్లారు. అప్పటి నుంచి కనిపించకుండాపోయిన తృప్తి అనూహ్యంగా శ్రీకాకుళం జిల్లాలో శవమై కనిపించింది. తృప్తి కనిపించడంలేదంటూ ఆమె తల్లిదండ్రులు ఈ నెల 26న బరంపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేశారు. తృప్తి తండ్రి బికేకానంద పండా చత్రపురం పోలీస్ క్వార్టర్స్ లో మెడికల్ షాపు నిర్వహిస్తున్నారు.

ఎలా జరిగిందో..!
ఈ హత్యోదంతంపై సోంపేట సీఐ సూరియాయుడు మాట్లాడుతూ.. ఈ నెల 27న బేసిరామచంద్రాపురం వద్ద యువతి మృతదేహాన్ని గుర్తించామని, ఆమె ఎవరో, ఎందుకు హత్యకు గురైందో తెలుసుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటుచేశామని, చివరికి ఆమె పేరు, తల్లిదండ్రుల వివరాలు గుర్తించామని, నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కేసు దర్యాప్తును వేగవంతంగా నిర్వహిస్తున్న సోంపేట, కంచిలి, బారువ ఎస్‌ఐలకు, పోలీసు సిబ్బందికి సీఐ అభినందనలు తెలిపారు. సోమవారం సోంపేట ఆసుపత్రి వద్దకు చేరుకున్న తృప్తి తల్లిదండ్రులు కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తమకు ఎవరితో ఎలాంటి తగాదాలు లేవని, ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావటం లేదని వారు చెప్పారు.

మరిన్ని వార్తలు