ఆగని ఆకృత్యాలు.. బాలికపై యువకుడి అత్యాచారం

24 Oct, 2013 03:12 IST|Sakshi
ఆగని ఆకృత్యాలు.. బాలికపై యువకుడి అత్యాచారం

* నిజామాబాద్ జిల్లాలో బాలికపై యువకుడి అత్యాచారం
* ఖమ్మం జిల్లాలో వివాహితపై ఆటోడ్రైవర్ల గ్యాంగ్ రేప్
* మెదక్ జిల్లాలో వదినపై మరిది అత్యాచార యత్నం..  హత్య
* కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో లైంగికదాడికి యత్నాలు
 
 సాక్షి, నెట్‌వర్క్ :
మొన్న ఢిల్లీలో నిర్భయ, నిన్న హైదరాబాద్‌లో అభయలపై అత్యాచార ఘటనలు మరువక ముందే తెలంగాణ జిల్లాల్లో పలుచోట్ల మృగాళ్ల అకృత్యాలు వెలుగుచూస్తున్నాయి. కాగా, ఇందులో ఖమ్మంలో జరిగిన రెండు ఘటనలతోపాటు కరీంనగర్‌లో విద్యార్థినిపై లైంగికదాడికి యత్నించింది ఆటోడ్రైవర్లే కావడం గమనార్హం. వివరాలిలా ఉన్నాయి...


 - నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం బాలానగర్ వడ్డెరకాలనీలో నివాసముండే బాలిక (12) ఏడో తరగతి చదువుతోంది. మంగళవారం ఉదయం ఆమె స్థానిక పాఠశాలకు వెళ్లడానికి సిద్ధమవుతుండగా బోదాసు బాలకృష్ణ అనే యువకుడు నోటు బుక్కులిస్తానని నమ్మించి ఆమెను తన ఇంట్లోకి తీసుకెళ్లాడు. నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం చేసి, ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించాడు. కూలీకి వెళ్లిన తల్లిదండ్రులు ఇంటికి రాగానే బాలిక ఏడుస్తూ విషయం చెప్పడంతో వారు ఆ యువకుడిని నిలదీసి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలకృష్ణను అదుపులోకి తీసుకున్న పోలీసులు  బాలికను వైద్య పరీక్షల కోసం నిజామాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు.
 
 ళ ఖమ్మంజిల్లా రఘునాథపాలెం మండలం చిమ్మపూడి గ్రామానికి చెందిన ఓ వివాహిత(26) కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తతో విడిపోయి రెండేళ్లుగా తన కుమార్తెతో కలిసి తల్లి గారింట్లో ఉంటోంది. కాగా, ఈనెల 19వ తేదీ రాత్రి  ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని గమనించిన  ఆటో డ్రైవర్లు లక్ష్మణ్, విజయ్ ఆమె నోట్లో గుడ్డలు కుక్కి ‘అరిస్తే నీ కుమార్తెను చంపుతామని’ బెదిరించి లైంగికదాడికి పాల్పడ్డాడు. దీంతో భయపడిన ఆమె ఆలస్యంగా బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
- ఖమ్మంజిల్లా ముదిగొండ మండలం చిరుమర్రికి చెందిన ఓ యువతి(19) ఖమ్మంలోని త్రీటౌన్‌లో ఉన్న ఓ వస్త్ర దుకాణంలో పని చేస్తోంది. మంగళవారం రాత్రి 9 గంటలకు ఇంటికెళ్లేందుకు ఆటో ఎక్కింది.  అందులో ఓ మహిళ , మరో వ్యక్తి ఉన్నారు. అయితే, ఆటోను దారిమళ్లించడంతో ఆ యువతి కేకలు వేసింది. దీంతో ఆటోలో ఉన్న మహిళతో పాటు మరో వ్యక్తి యువతి నోరు మూశారు. గోపాలపురం వద్ద నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి లైంగికదాడికి యత్నించగా స్పృహ కోల్పోయింది. భయపడిన వారు ఆమె చెవి దిద్దులు తీసుకొని పరారయ్యారు.
 
 - మెదక్ జిల్లా  నారాయణఖేడ్ మండలం రుద్రారం గ్రామానికి చెందిన కాశమోళ్ల సుజాత(27)పై ఆమె వరుసకు మరిది అయిన చందర్ కన్నేశాడు. ఓ రోజు అర్ధరాత్రి ఇంట్లో ఎవరూ లేనిది చూసి  మద్యం సేవించి సుజాత నోటికి లుంగీ, టీ షర్టు చుట్టి అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో కత్తితో పొడిచి హత్య చేసి పరారయ్యాడు.  
 
 - కరీంనగర్ నగర శివార్లలోని ఓ పాఠశాలలో 9వ తరగతి చదువుకుంటున్న ఓ విద్యార్థిని (15) దసరా సెలవులకు ఆదిలాబాద్ జిల్లాలోని స్వగ్రామానికి వెళ్లి బుధవారం బాబాయితో కలిసి తిరిగి వచ్చింది. ఆకలేస్తున్న ఆమెకు టిఫిన్ తినిపించిన బాబాయి ఓ ఆటో మాట్లాడి విద్యార్థిని పాఠశాల వద్ద దింపమని చెప్పి ఇంటికెళ్లిపోయాడు. ఆటో ఎక్కిన విద్యార్థిని ఆటో డ్రైవర్‌లో మాటల్లో పెట్టి దారి మళ్లించి  రేకుర్తి కంటి ఆస్పత్రి పక్కన ఉన్న చెరువు వద్దకు తీసుకువెళ్లి అమెపై అత్యాచారానికి యత్నించాడు. తీవ్రంగా ప్రతిఘటించిన విద్యార్థిని అతడిని తోసేసి పారిపోయి చెట్ల పొదల్లో దాక్కుంది. అరగంట తర్వాత నడుచుకుంటూ రోడ్డుపైకి రాగా, స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వగా, ఆటోడ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరిన్ని వార్తలు