మనిషి ప్రాణాలకు విలువ లేకుండా పోతోంది. మానవత్వం ఆనవాలు కనిపించడం లేదు. 18 ఏళ్ల యువకుడు రోడ్డు ప్రమాదానికి గురై.. రోడ్డుమీద రక్తం కారుతూ పడి ఉన్నా ఏ ఒక్కరూ అతడిని ఆస్పత్రికి తరలించలేదు సరికదా, పైపెచ్చు అతడు బాధతో విలవిల్లాడుతుంటే వీడియోలు తీసుకున్నారు. కర్ణాటకలోని కొప్పల్ జిల్లాకు చెందిన అన్వర్ అలీ (18) సైకిల్ మీద వెళ్తుండగా అతడిని ఓ బస్సు ఢీకొంది.
అలీ రోడ్డు మీద పడి అతడికి రక్తస్రావం అవుతోంది. ఆ సమయానికి అక్కడ చాలామందే ఉన్నారు గానీ, ఏ ఒక్కరూ అతడి ప్రాణాలను కాపాడాలని గానీ, ఆస్పత్రికి తీసుకెళ్లాలని గానీ అనుకోలేదు. ఎట్టకేలకు ఎవరో స్పందించి అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడ చికిత్స పొందుతూ అలీ మరణించాడు. ప్రమాదం జరిగిన వెంటనే అతడిని ఆస్పత్రికి తీసుకొచ్చి ఉంటే రక్తస్రావాన్ని నియంత్రించి అతడి ప్రాణాలు కాపాడగలిగేవాళ్లమని వైద్యులు చెప్పారు.