హైదరాబాద్‌పై కాంగ్రెస్ కోర్ కమిటీలో సుదీర్ఘ చర్చ

23 Nov, 2013 02:20 IST|Sakshi
హైదరాబాద్‌పై కాంగ్రెస్ కోర్ కమిటీలో సుదీర్ఘ చర్చ
  • హైదరాబాద్‌పై కాంగ్రెస్ కోర్ కమిటీలో సుదీర్ఘ చర్చ
  •   రాజ్యాంగంలో ‘ఉమ్మడి రాజధాని’ అనేది లేనందున ఇబ్బందులు వస్తాయన్న కపిల్ సిబల్
  •   రాజ్యాంగ సవరణ తప్పకపోవచ్చని వెల్లడి
  •   దానికన్నా.. శాంతిభద్రతలను తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాలకే అప్పగించవచ్చని సూచన
  •   న్యాయనిపుణులతో చర్చించి పరిష్కారాలు చూపాలని సిబల్‌కు కోర్ కమిటీ నిర్దేశం
  •   371డి అధికరణ, సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ అంశాలపైనా కోర్ కమిటీ భేటీలో చర్చ
  •   ఆయా అంశాలపై ఈ నెల 25-28 తేదీల మధ్య మంత్రుల బృందం మళ్లీ భేటీ అయ్యే అవకాశం
  •   వచ్చే నెల 15 నాటికి  రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీ ద్వారా రాష్ట్రపతికి చేరేలా ప్రణాళిక
  •  
     న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయించిన కాంగ్రెస్ అధిష్టానానికి హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా చేయటమెలా అనే అంశం ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్‌ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఏర్పాటు చేస్తామని ప్రకటించినప్పటికీ.. ఇందుకు రాజ్యాంగ, న్యాయపరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందని నిపుణులు చెప్పటంతో.. దీనిని అధిగమించేందుకు మార్గాలను అన్వేషిస్తోంది. ఢిల్లీ తరహాలో హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా చేయాలంటే రాజ్యాంగ సవరణ తప్పకపోవచ్చని న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్ శుక్రవారం కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీలో పేర్కొన్నట్లు తెలిసింది. అలా చేయటంకన్నా.. రెండు రాష్ట్రాల ప్రభుత్వాల ప్రతినిధులతో కమిటీని ఏర్పాటు చేసి రాజధానిలో శాంతిభద్రతల బాధ్యతలు ఆ కమిటీకి అప్పగించవచ్చని ఆయన ప్రతిపాదించినట్లు సమాచారం. 
     
     దీంతో ఈ అంశాలపై న్యాయనిపుణులను సంప్రదించి పరిష్కార మార్గాలు చూపాలని కాంగ్రెస్ కోర్ కమిటీ సిబల్‌కే బాధ్యతలు అప్పగించింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి రాజ్యాంగంలో పొందుపరచిన 371డి అధికరణను కొనసాగించటం లేదా రద్దు చేయటం విషయంలోనూ న్యాయనిపుణుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండటంతో దాని పరిష్కారంపైనా దృష్టి సారించింది. ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ నివాసంలో శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ అయింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఆమె రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్‌పటేల్, ఆర్థికమంత్రి పి.చిదంబరం, హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే, రక్షణమంత్రి ఎ.కె.ఆంటోనీలు పాల్గొన్న ఈ సమావేశానికి.. కోర్ కమిటీ సభ్యుడు కానప్పటికీ న్యాయశాఖ మంత్రి కపిల్‌సిబల్‌ను ఈ సమావేశానికి ప్రత్యేకంగా పిలిపించారు. దాదాపు గంటన్నర పాటు జరిగిన సమావేశంలో హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, ఆర్టికల్ 371డి, సీమాంధ్రకు ప్యాకేజీ అంశాలపైనే ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. 
     
     రాజ్యాంగంలో ‘ఉమ్మడి రాజధాని’ లేదు...
     కాంగ్రెస్ వర్గాల సమాచారం మేరకు.. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ఛత్తీస్‌గఢ్ పోలింగ్ సరళితో పాటు ఇతర రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితిపై భేటీలో తొలుత చర్చించారు. అనంతరం ఆంధప్రదేశ్ విభజన, కేంద్ర మంత్రుల బృందం నివేదిక అంశాలపై సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. రాష్ట్ర విభజనలో హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేయటమా? లేదా కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చటమా? అనే అంశంపై చర్చ కేంద్రీకృతమైంది. హైదరాబాద్‌ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నందున దీనిని అమలు చేయాలంటే ఉత్పన్నమయ్యే సమస్యలపై కపిల్‌సిబల్‌ను అడిగి తెలుసుకున్నారు. రాజ్యాంగంలో ఉమ్మడి రాజధాని అనే పదమే లేనందున పార్లమెంటులో చర్చకు వచ్చినప్పుడు ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ తరహాలో కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే తెలంగాణలో కాంగ్రెస్‌కు ఆశించిన ప్రయోజనం దక్కే అవకాశం లేదని భేటీలో అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ను యూటీ చేయాలంటూ సీమాంధ్ర కేంద్రమంత్రులు ఒత్తిడి తెస్తున్న అంశాన్ని షిండే ప్రస్తావించగా.. పార్టీ ప్రయోజనాల రీత్యా ఇది ఏమాత్రం సమ్మతం కాదని సోనియాగాంధీ తోసిపుచ్చినట్లు తెలుస్తోంది.సీడబ్ల్యూసీ, కేంద్ర కేబినెట్ నిర్ణయం మేరకు పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని చేయటమే మేలనే భావనకు వచ్చారు. 
     
     రాజ్యాంగ సవరణ తప్పకపోవచ్చు...
     ఢిల్లీ తరహాలో హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఏర్పాటు చేస్తే ఎదురయ్యే న్యాయపరమైన ఇబ్బందులపై కోర్ కమిటీ సభ్యులు ఆరా తీశారు. కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న ఢిల్లీ జాతీయ రాజధానిగా ఉన్న దృష్ట్యా రాజ్యాంగ సవరణ ద్వారా ఆయా అంశాలను బదలాయించారని.. హైదరాబాద్‌ను ఆ విధంగా చేయాలనుకుం టే అందుకోసం రాజ్యాంగ సవరణ తప్పకపోవచ్చని సిబల్ అభిప్రాయపడ్డట్లు తెలిసింది. అయితే.. సీడబ్ల్యూసీ నిర్ణయం మేరకు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఏర్పాటు చేసి శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యతను ఇటు తెలంగాణ, అటు సీమాంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగిస్తే మేలని ఆయన సూచించినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అందులో భాగంగా ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రతినిధులతో ఓ కమిటీని ఏర్పాటు చేసి రాజధానిలో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చూసుకునే బాధ్యత అప్పగించాలని కోరేలా నోట్‌ను రూపొందించినట్లు సమాచారం. ఉమ్మడి రాజధాని విషయంలో న్యాయవర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాజ్యాంగ నిపుణుల సలహాలు తీసుకుని భవిష్యత్తులో రాజ్యాంగ, న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా తగిన ప్రతిపాదనను రూపొందించాలని కమిటీ భావించింది. ఆ బాధ్యతను కపిల్‌సిబల్‌కు అప్పగించినట్లు సమాచారం. 
     
     శీతాకాల సమావేశాల్లో బిల్లుకు ప్రణాళిక...
     మరోవైపు పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టేలా ప్రణాళిక రూపొందించుకోవాలని షిండేకు సోనియా సూచించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా నెలాఖరు లోగా తెలంగాణ బిల్లుకు కేబినెట్ ఆమోదం పొందేలా చేసి ఆ వెంటనే రాష్ట్రపతి ద్వారా ఆంధ్రప్రదేశ్ శాసనసభకు పంపాలని నిర్దేశించినట్లు సమాచారం. డిసెంబర్ 15 నాటికి అసెంబ్లీ అభిప్రాయాలు రాష్ట్రపతికి చేరేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే శీతాకాల సమావేశాలను పొడిగించి విభజన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే విషయాన్ని ఆలోచిద్దామని ప్రతిపాదించినట్లు చెప్తున్నారు. అదే సమయంలో సీమాంధ్ర ప్రాంతానికి మంచి ప్యాకేజీ ప్రకటించేలా ప్రతిపాదనలు రూపొం దించటం ద్వారా ఆ ప్రాంత నేతలకు ఊరట కలిగించాలని సోనియా సూచించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో.. రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రుల బృందం వచ్చే వారం (నవంబర్ 25 - 28 మధ్య) రెండు రోజుల పాటు సమావేశం కావాలని నిర్ణయించినట్లు తెలిసింది. రాబోయే కేంద్ర కేబినెట్ సమావేశానికి నివేదికను సమర్పించేలా జీవోఎం సభ్యులు సన్నద్ధమవుతున్నారు. 
మరిన్ని వార్తలు