నయనకే విలనయ్యా!

19 Apr, 2017 20:55 IST|Sakshi
లేడీసూపర్‌స్టార్‌ నయనతారకే తాను విలన్‌ అయ్యానన్న ఆనందంలో మునిగి తేలుతున్నాడు వర్ధమాన నటుడు షాన్‌. ఈయన నిజంగా చాలా లక్కీఫెలోనే అనాలి. తొలి చిత్రంలోనే బాలీవుడ్‌ భామ ఇషా తల్వార్‌కు లవర్‌గానూ, ఆ తరువాత ఇంగ్లిష్‌ బ్యూటీ ఎమీజాక్సన్‌కు బాయ్‌ఫ్రెండ్‌గా నటించాడు. ఇటీవల నయనతారకు విలన్‌ అయ్యాడు. ఇంకా ఆయనకు గుర్తింపు రాక ఏమవుతుంది. అలా పలువురి ప్రశంసలు అందుకుంటున్న వర్ధమాన నటుడు షాన్‌ తన గురించి తెలుపుతూ కోవై జిల్లా, పొల్లాచ్చిలో ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన తాను నటనపై ఇష్టంతో ఆ దిశగా పయనం సాగించానన్నాడు.

అలా దర్శకుడు మిత్రన్‌ జవహర్‌ను కలిసి అడిషన్‌లో సెలెక్ట్‌ అయి ఒరు కాదల్‌ కథై చిత్రం ద్వారా నటుడిగా పరిచయం అయ్యానని తెలిపాడు. అందులో నటి ఇషా తల్వార్‌ ప్రేమికుడిగా నటించానని అన్నాడు. ఒరు కాదల్‌ కథై చిత్రంలో నటించిన వేళా విశేషం కావచ్చు ఆ చిత్ర విడుదలకు ముందే ధనుష్‌ కథానాయకుడిగా నటించిన తంగమగన్‌ చిత్రంలో ఎమీజాక్సన్‌కు బాయ్‌ఫ్రెండ్‌గా నటించే అవకాశం వచ్చిందన్నాడు. ఆ చిత్రం తనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టిందని చెప్పాడు. ఆ తరువాత డోరా చిత్రంలో నయనతారకు విలన్‌గా నటించే లక్కీఛాన్స్‌ వచ్చిందన్నాడు.

డోరా చిత్రంలో పవనశర్మగా ప్రధాన విలన్‌ పాత్రలో నటించడం చాలా మంచి అనుభవంగా పేర్కొన్నాడు. నయనతారను చూడడానికే లక్షలాది మంది తపం చేస్తుంటే ఆమెకు విలన్‌గా నటించే అవకాశం రావడం నిజంగా తన అదృష్టం అన్నాడు. డోరా చిత్రం తన స్థాయిని పెంచిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ప్రస్తుతం నవ దర్శకుడు సజోసుందర్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో పోలీస్‌ అగా ప్రధాన పాత్రను పోషిస్తున్నానని తాను విలన్‌గానే స్థిరపడాలని ఆశిస్తున్నానని తెలిపాడు. అలాంటి పాత్రలకే భాషా భేదం లేకుండా ఆదరణ లభిస్తుందని అని నటుడు షాన్‌ అంటున్నారు.
 
మరిన్ని వార్తలు