ప్రకృతి ఆహారంతో ఎలర్జీ పరారీ!

16 Oct, 2014 03:33 IST|Sakshi
తన ఇంటివద్ద సేంద్రియ పద్దతుల్లో పండించిన వంకాయలను చూపిస్తున్న శివరామరెడ్డి

అద్దె ఇంట్లో నివాసం ఉంటూనే.. స్ఫూర్తిదాయకంగా ఇంటిపంటల సాగు
21 రోజులకోసారి జీవామృతం తప్ప ఖర్చే లేదు  

 
ఆహారమే ఔషధం అన్నారు పెద్దలు. కానీ, వ్యవసాయ రసాయనాలతో కలుషితమైన ఆకుకూరలు, కూరగాయలే మార్కెట్‌కు వస్తుంటే ఏమిటి పరిష్కారం? వీలైనంతలో కుండీలో, మడులో ఏర్పాటు చేసుకొని ఇంటిపట్టునే పండించుకోవడం కన్నా తెలివైన పని మరొకటేమి ఉంటుంది? అద్దె ఇంట్లో నివాసం ఉంటూ కూడా అన్నపరెడ్డి శివరామరెడ్డి (94932 74948) కుటుంబం మక్కువతో ఇంటిపంటలు పండించుకుంటున్నది.
 
 గుంటూరు జిల్లా చుండూరు మండలం మోదుకూరులో జన్మించిన ఆయన తెనాలిలో హోటల్ మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. సమీపంలోని కటివరంలో అద్దె ఇంట్లో వారి కుటుంబం నివసిస్తున్నది. రెండేళ్ల క్రితం ఇంటి ముందు రెండు సెంట్ల పెరట్లో కొన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలతో ఇంటిపంటల సాగు ప్రారంభమైంది. అయితే, అప్పటికి సేంద్రియ పద్ధతుల్లో మొక్కల పెంపకంపై అవగాహన లేదు. ఏడాది క్రితం ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ఒక రైతు పరిచయం కావడంతో శివరామరెడ్డి ఇంటిపంటల సాగు పద్ధతి పూర్తిగా మారిపోయింది.
 
 రసాయనిక ఎరువులు, పురుగుమందులు లేకుండా ఘన జీవామృతం, జీవామృతంతో పంటలు సాగు చేయడం చూసినప్పుడు విచిత్రంగా అనిపించిందని ఆయన చెప్పారు. సావధానంగా వివరాలు అడిగి తెలుసుకొని అనుసరిస్తున్న తర్వాత గొప్ప సంతోషం కలిగిందన్నారు. ఈ ఆహారం తింటున్నందున ఫుడ్ ఎలర్జీ మాయమైందన్నారు. అంతకుముందు వంగ, గోంగూర తింటే దురదలు వచ్చేవని, ఇప్పుడు ఆ ఊసే లేకుండాపోయిందని ఇంట్లో అందరం హ్యాపీగా వీటిని వారానికి మూడు రోజులు తింటున్నామన్నారు.
 
 వంగ, మిరప, టమాటా, గోంగూర(4 రకాలు), గోరుచిక్కుడు, చిక్కుడు, బీర, బెండ, కొత్తిమీర, ఆకుకూరలు సాగు చేస్తున్నారు. 2 సెంట్ల పెరట్లో, మేడమీద 30 కుండీల్లో కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తున్నారు. అన్నీ దేశవాళీ విత్తనాలే సాగు చేస్తున్నారు. మేడ మీద కుండీల్లో బీర, దొండ, కాకర పాదులు చక్కగా కాస్తున్నాయి. 40 కుండీల్లో చామంతులు, మరో 40 కుండీల్లో గులాబీలనూ వేశారు.
 
 21 రోజులకోసారి జీవామృతం!
 నల్ల రేగడి మట్టి, ఎర్రమట్టి, పశువుల ఎరువు కలిపిన మట్టి మిశ్రమాన్ని కుండీల్లో వేశారు. 21 రోజులకోసారి జీవామృతం(1:10 పాళ్లలో నీటిలో కలిపి) మొక్కల మొదళ్లలో పోయడంతోపాటు, మొక్కలు పూర్తిగా తడిచేలా పిచికారీ చేస్తున్నారు. కుండీల్లో 3 రోజులకోసారి నీరు పోస్తున్నామన్నారు. నల్లరేగడి నేలలో పెరట్లో పెరుగుతున్న మొక్కలకు 21 రోజులకోసారి పోసే జీవామృతం సరిపోతున్నదన్నారు. ఎండాకాలంలో 10-15 రోజులకోసారి నీరు పోయాల్సి వస్తుందన్నారు. రసాయనిక ఎరువులు వాడినప్పుడు నేల రాయిలా గట్టిపడేదని, జీవామృతం వాడుతున్న దగ్గర్నుంచి నేల సారవంతమై, గుల్లబారి మెత్తగా చేతితో గుంత తీయడానికి అనువుగా మారిందన్నారు.  
 
 ఈ రుచే వేరు!
 జీవామృతంతో పండిన కూరగాయల రుచే వేరని, స్వల్పంగా తీపి రుచి ఉంటుందన్నారు. ఒకసారి రుచి చూసిన వారు మళ్లీ మామూలు కూరగాయలు తినలేరని, తామూ ఇంటిపంటలు పండించుకోవాలన్న ఆలోచన చేస్తున్నారని ఆయన అన్నారు. ఒక కాపునకు మరో కాపునకు మధ్యకాలంలో టమాటాలతోపాటు బంగాళదుంపలు తప్ప బయట కొనాల్సిన అవసరం లేకుండా 90% వరకు ఇంటిపంటలపైనే ఆధారపడుతున్నామని శివరామరెడ్డి సంతృప్తిగా చెప్పారు. తమ ఇంటి యజమాని కూడా ఇంటిపంటలపై మక్కువతో సహకరిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఫేస్‌బుక్‌లో ఇంటిపంట గ్రూప్‌లో యాక్టివ్ మెంబర్ అయిన శివరామరెడ్డి సంతోషకరమైన తన ఇంటిపంటల అనుభవాలతోపాటు తపాలా ద్వారా విత్తనాలనూ పంచిపెడుతూ ఇతరులకు స్ఫూర్తినిస్తున్నారు. శివరామరెడ్డి కొందరు మిత్రులతో కలసి పది సెంట్ల స్తలంలో ఉమ్మడి ఇంటిపంటల క్షేత్రాన్ని ప్రారంభించనుండడం అభినందనీయం.
 

>
మరిన్ని వార్తలు