పంటచేలో వరద చిచ్చు.. రైతులూ మేల్కోండి

11 Sep, 2014 01:49 IST|Sakshi

పత్తి
సాధ్యమైనంత వరకు పొలంలో నీరు నిల్వకుండా చూడాలి. నీరు నిల్వ ఉంటే మురుగు కాల్వలు ఏర్పాటు చేసి బయటకు పంపించాలి.
 
వీలైనంత త్వరగా అంతర కృషి (పాటు) చేయాలి. దీనివల్ల భూమిలో తేమ తగ్గడం , వేర్లకు గాలి, పోషకాలు అందడంతో మొక్కలు త్వరగా సాధారణ స్తితికి వస్తాయి.
 
 నీరు బయటకు పంపిన తరువాత ఎకరాకు 25 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్‌ను మొక్కకు 5-6 సెం.మీ దూరంలో గుంతలు తీసి వేయాలి. లేదా అంతరకృషి చేయాలి.
 
పొలంలో తేమ అధికంగా ఉన్నప్పుడు వేర్లు పోషకాలు, నీటిని తీసుకోలేక ఆకులు లేత ఆ కుపచ్చ రంగులోకి మారుతాయి. దీనివల్ల పె రుగుదల తగ్గుతుంది. కాబట్టి పైరుపై 20 గ్రా ముల యూరియా లేదా పది గ్రాముల పొటాషియం నైట్రేట్‌ను లీటర్ నీటిలో కలిపి ఐదు రో జుల వ్యవధిలో రెండుమూడు సార్లు పిచికారీ చేస్తే మొక్కలు త్వరగా కోలుకుంటాయి.
 
 భూమి, వాతావరణంలో తేమ అధికంగా ఉన్నప్పుడు పత్తిని ఆకుమచ్చ తెగులు ఆశించే అవకాశం ఉంది. దీని నివారణకు పది లీటర్ల నీటిలో కాపర్‌ఆక్సీక్లోరైడ్ 30 గ్రాములు, గ్రాము స్ట్రెప్టోసైక్లిన్‌ను కలిపి పిచికారీ చేయాలి.
 
భూమిలో అధిక తేమ ఉన్నప్పుడు వేరుకుళ్లు తెగులు ఆశించి మొక్కలు చనిపోతాయి. దీని నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ మూడు గ్రాములు లేదా కార్బండిజమ్ రెండు గ్రాములు లీటర్ నీటిలో కలిపిన ద్రావణాన్ని తెగులు సోకిన మొక్క మొదళ్లలో పోయాలి.

 వరి
 వరి ప్రస్తుతం దుబ్బు చేసే దశలో ఉంది. వీలైనంత త్వరగా నిల్వ ఉన్న నీటిని బయటకు పంపించాలి. తరువాత ఎకరాకు 20 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్ వేయాలి. ముంపు పాలైన వరి పొలాల్లో తెగుళ్లు వ్యాపించే అవకాశం ఉంది.
 
ఆకుముడత పురుగు: ఈ పురుగు ఆకుముడతలో ఉండి పత్రహరతాన్ని హరించటం వల్ల ఆకులు తెల్లపడతాయి. దీని నివారణకు పిలక దశలో చేనుకు అడ్డంగా తాడుతో 2-3 సార్లు లాగితే పురుగులు కిందబడిపోతాయి. క్లోరిఫైరీఫాస్ 2.5 మి.లీ లేదా కార్టాప్‌హైడ్రోక్లోరైడ్ రెండు గ్రాములు లేదా క్లోరాన్ట్‌నిలిప్రోల్ 0.4 మి.లీ లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా ఫ్లూబెండమైడ్ 20 డబ్ల్యూడీజీ 0.25 గ్రాములు లేదా 48 ఎన్‌సీ 0.1మి.లీ లీటర్ నీటిలో కలిపి వాడాలి. లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4 జి గుళికలు ఎకరాకు ఎనిమిది కిలోలు వేయాలి.
 
తాటాకు తెగులు: హిస్పాపిల్లా పెద్దపురుగులు ఆకులోని పత్రహరితాన్ని గోకి తినివేయటం వల్ల తెల్లటి చారలు ఏర్పడి ఆకులు ఎండిపోతాయి. దీని నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ లేదా క్లోరిఫైరీఫాస్ 2.5 మి.లీ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
 
పొడతెగులు: దుబ్బు చేసే దశ నుంచి ఆకులపై మచ్చలు పెద్దగై పాము పొడ మచ్చలుగా ఏర్పడుతాయి. మొక్కలు పూర్తిగా ఎండిపోతాయి. దీని నివారణకు హెక్సాకొనజోల్ రెండు మి.లీ లేదా వాలిడా మైసిన్ రెండు మి.లీ లేదా ప్రోపికొనజోల్ మి.లీ లేదా ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ + టెబ్యుకొనజోల్ 75 డబ్ల్యూజీ 0.4 గ్రాములు లీటర్ నీటిలో కలిపి 15 రోజులకు ఒకసారి చొప్పున రెండు సార్లు పిచికారీ చేయాలి.
 
అగ్గితెగులు: అగ్గితెగులు నివారణకు ట్రైసైక్లోజోల్ 0.6 గ్రాములు లేదా ఐసోప్రోధయొలేన్ 1.5 మి.లీ లేదా కాసుగామైసిన్ 2.5 మి.లీ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

 మిరప
 అధిక వర్షాలు, అధిక తేమ వల్ల మిరపలో ఆకుమచ్చ తెగులు, వేరుకుళ్లు, కాండం కుళ్లు, కొనోఫెరా కొమ్ముకుళ్లు, లద్దెపురుగు ఆశించే అవకాశం ఉంది.
 
ఆకుమచ్చ తెగులు: ఆకుల మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడి ఆకులు పండుబారి రాలిపోతాయి. దీని నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 30 గ్రాములు, గ్రాము స్ట్రెప్టోసైక్లిన్ పది లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
 
వేరుకుళ్లు తెగులు: మొక్కలు వడలిపోయి ఎండిపోతాయి. దీని నివారణకు లీటర్ నీటిలో మూడు గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపి వడలిపోయిన చెట్ల మొదళ్లు, చుట్టుపక్కల తడపాలి.
 
కాండంకుళ్లు: దీని నివారణకు 1.5 గ్రాముల థయోఫానెట్ మిథైల్‌ను లీటర్ నీటిలో కలిపి మొక్క కాండం అంతా తడిసేటట్లు పిచికారీ చేయాలి.
 
కానోఫోరా కొమ్మకుళ్లు తెగులు: ఈ తెగులు సోకిన లేత చిగుళ్లు మాడిపోయి కణుపుల వద్ద కొమ్మలు కుళ్లి విరిగి పోతాయి. దీని నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 30 గ్రాములు, గ్రాము స్ట్రెప్టోసైక్లిన్ 10 లీటర్ల నీటిలో కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
 
లద్దె పురుగు: మిరపలో లద్దెపురుగు సోకే అవకాశం ఉంది. దీని నివారణకు థయోడికార్బ్  గ్రాము లేదా క్లోర్‌ఫిన్‌ఫైర్ రెండు మి.లీ లేదా స్ప్రైనోసాడ్ 0.38 మి.లీ లేదా క్లోరీఫైరీఫాస్ 2.5మి.లీ లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా క్వినాల్‌ఫాస్ 2 మి.లీ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

మరిన్ని వార్తలు