‘పాడిపై దృష్టి సారించాలి’

21 Nov, 2014 02:41 IST|Sakshi

నందిపేట : సహకార సంఘాలు పాడిపై దృష్టి సారించి, లాభాలు ఆర్జించాలని జిల్లా సహకార అధికారి శ్రీహరి సూచించారు. గురువారం డొంకేశ్వర్ సొసైటీలో 61వ జాతీయ సహకార వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ సహకార సంఘాల ద్వారా రైతులకు సేవలందించడంతో పాటు వ్యాపారంలో నిజామాబాద్ జిల్లా అగ్రస్థానంలో ఉందన్నారు. జిల్లాలో సహకార సంఘాల పనితీరు బాగుందన్నారు. సొసైటీలను మరింత లాభాల బాటలో నడిపించేందుకు పాలక వర్గాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.

ఇందులో భాగంగా సొసైటీ పరిధిలోని గ్రామాలలో రైతుల నుంచి పాలను సేకరించడం, వే బ్రిడ్జిలను నెలకొల్పడంలాంటి వ్యాపారాలను చేపట్టాలన్నారు. వారానికోసారి ఆర్థిక లావాదేవీలను సరిచూసుకోవాలని సూచించారు. బకాయిల వసూళ్లపై దృష్టి సారించాలన్నారు. అనంతరం వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో డివిజనల్ సహకార అధికారి మనోజ్ కుమార్, సొసైటీ చైర్మన్ భోజారెడ్డి, వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, డెరైక్టర్లు సాయరెడ్డి, నరేందర్, రాజన్న, భూమేశ్, గంగారెడ్డి, సొసైటీ కార్యదర్శి నారాయణ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు