ఆరోగ్య వంటలు

8 Jun, 2014 23:06 IST|Sakshi
ఆరోగ్య వంటలు

జ్ఞానం మనం పెంచుకుంటే మనమే బాగుంటాం. మనకున్న జ్ఞానాన్ని పదిమందికీ పంచిపెడితే... ఎందరికో మేలు చేసినవాళ్లమవుతాం. ఈ విషయాన్ని నందిత షా బాగా నమ్ముతారు. అందుకే తనకు తెలిసిన మంచి సంగతుల్ని అందరికీ తెలియజేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారామె. వృత్తిరీత్యా డాక్టర్ అయిన నందిత... వైద్యం మాత్రమే చేయరు. వైద్యం అవసరమే ఎవరికీ లేకుండా చేయాలని తపన పడతారు!
 
రోగులు ఎక్కువమంది వస్తే హాస్పిటల్ బాగా నడుస్తుందని ఏ డాక్టరైనా అనుకుంటారు. కానీ తన హాస్పిటల్ ఎప్పుడూ ఖాళీగా ఉండాలని కోరుకునే డాక్టర్ ఎవరైనా ఉంటారా? ఉంటారు. కాదు, ఉన్నారు. ఆవిడే నందిత షా. రోగుల్ని ప్రేమించే నందిత... రోగాల పేరెత్తితే మాత్రం విసుక్కుంటారు. అసలు రోగం ఎందుకు రావాలి, ఎందుకు మనల్ని ఇబ్బంది పెట్టాలి, మన దగ్గరకు రాకుండా దాన్ని మనం ఎందుకు ఆపలేకపోతున్నాం అంటూ ఎమోషనల్‌గా మాట్లాడతారు. అలాగని ఆమె కేవలం మాటల మనిషి కాదు. చేతల మనిషి. చేరాలనుకున్న గమ్యాన్ని అందుకోవడం కోసం జీవితాన్నే అంకితం చేసే మనిషి!
 
లక్ష్యం మారిందలా...

కొందరు జీవించడానికి తింటారు. కొందరు తినడమే జీవితం అన్నంతగా ఆహారాన్ని ప్రేమిస్తుంటారు. అసలు అదే పెద్ద రోగం అంటారు నందిత. అలాంటి వారిలో మార్పు తీసుకు రావడమే లక్ష్యంగా ఓ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారామె. అది పెరిగి పెరిగి... చివరకు ఓ పెద్ద ఉద్యమంలా తయారైంది.

 1981లో... ముంబైలోని సీఎం పీహెచ్ మెడికల్ కాలేజీ నుంచి హోమియోపతి డాక్టర్ పట్టా పుచ్చు కున్నారు నందిత. వెంటనే ప్రాక్టీస్ మొదలు పెట్టారు. ఉత్సాహంగా వైద్యం చేయసా గారు. కొన్నాళ్లు గడిచేసరికి ఆమె ఒక విషయం గమనించారు. అదేంటంటే... ఎక్కువగా మధుమేహ వ్యాధిగ్రస్తులే ఆమె దగ్గరకు వస్తున్నారు.
 
చక్కెర వ్యాధి ఒక్కసారి వచ్చిం దంటే జీవితాంతం వెంటాడు తూనే ఉంటుంది. అంతకాలం మందులు వాడటం చిన్న విషయం కాదు. అందుకే చాలామంది హోమియోపతిని ఆశ్రయిం చడం మొదలు పెట్టారు. ఆ విషయం అర్థం అయినప్పటి నుంచి నందిత మనసు మధు మేహం చుట్టూ తిరగసాగింది. దాని గురించి బాగా అధ్యయనం చేశారామె. ఆ భయంకర మైన వ్యాధికి అసలు కారణం అనారోగ్య కరమైన ఆహారపుటలవాట్లే అని అర్థం చేసుకున్నారు. వాటిని మార్చి తీరాలని బలంగా నిశ్చయించుకున్నారు. నాటి నుంచీ నందిత నడిచే మార్గంలో మార్పు వచ్చింది. అంతవరకూ రోగులకు వైద్యం చేయడమే తన కర్తవ్యమనుకున్న ఆమెకు మరో కొత్త గమ్యం ఏర్పడింది. భారత దేశాన్ని మధుమేహ రహిత దేశంగా మార్చడమే ఆమె లక్ష్యమైంది.
 
ఆహార ఉద్యమ సారథి...

‘‘ఆరోగ్యంగా జీవించడంలోనే ఆనందం ఉంది. ఆరోగ్యమే లేనప్పుడు మనకేది ఉన్నా, ఎన్ని ఉన్నా ఉపయోగం ఉండదు. అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే మన ప్రథమ లక్ష్యం కావాలి’’ అంటారు నందిత. మన దేశం నుంచి మధుమేహాన్ని తరిమికొట్టాలని నిర్ణ యించుకున్న ఆమె... ఆ వ్యాధికి కారణ మవుతున్న ఆహారపుటలవాట్ల మీద యుద్ధం ప్రక టించారు. ఆహార ఉద్యమాన్ని లేవదీశారు.

డయా బెటిస్‌ని తిప్పి కొడదాం అనే నినాదంతో ‘రివర్‌‌స డయా బెటిస్’ అనే కార్యక్రమానికి తెర తీశారు. దేశంలోని ప్రముఖ పట్టణాలన్నింటి లోనూ వర్‌‌కషాపులు, సెమినార్లు ఏర్పాటుచేసి... ఆహారపు టలవాట్లు మధుమేహానికి, గుండె వ్యాధులకు ఎలా కారణమవుతున్నాయో చెప్పడం మొదలుపెట్టారు. అంతేకాదు... సహజ సిద్ధమైన దినుసులతో రుచికరమైన ఆహారాన్ని ఎలా వండుకోవాలో నేర్పించడం మొదలుపెట్టారు నందిత.

ఆవిడ వంటకాలను రుచి చూసినవాళ్లంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. రుచులకు దూరం కాకుండా, అనారోగ్యాన్ని మాత్రమే దూరంగా పెట్టే ఆ ఆహార విధానాలను ఆమె వద్ద నుంచి నేర్చుకోవడానికి ముందుకొచ్చారు. అలా ఇరవయ్యేళ్లలో కొన్ని వేల మందిని, వారి జీవన విధానాలను మార్చేశారు నందిత.
 
‘‘ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంటే నోరు కట్టేసుకోవడం  కాదు. కావలసినంత తినొచ్చు. కావలసినన్నిసార్లు తినొచ్చు. కానీ ఆ తినేది ఏంటి అన్న విషయంలో మాత్రం స్పష్టత ఉండాలి’’ అని చెప్పే నందిత... ఆహారం కోసం ప్రకృతి మీద ఆధారపడితే చాలంటారు. ప్రకృతిలో లభించే సహజసిద్ధమైన ఆహారం తిన్నంతవరకూ ఎలాంటి  ఆరోగ్య సమస్యలూ రావనే ఆమె... ఆ విషయం గురించి తెలియజేయడానికి 2005లో ‘షారన్ (SHARAN - Sanctuary of health and reconnection to animals and nature) అనే సంస్థను కూడా స్థాపించారు.

మరికొందరు వైద్యులు, వాలంటీర్లతో కలిసి తన లక్ష్యసాధనలో మునిగిపోయారు. షారన్ పేరుతో ఆరువిల్లె (తమిళనాడు), అహ్మదాబాద్, బెంగళూరు తదితర నగరాల్లో వెజిటేరియన్ రెస్టారెంట్లు కూడా తెరిచారు. సహజసిద్ధంగా పండించిన ఆహార పదార్థాలను దేశమంతా సరఫరా చేస్తున్నారు. డెన్మార్‌‌క, జర్మనీ, ఇటలీ, ఐర్లాండ్, స్వీడన్, స్విట్జర్లాండ్, అమెరికా, బ్రిటన్‌లతో పాటు గల్ఫ్ దేశాలకు కూడా తన భావనలను, విధానాలను విస్తరించిన నందిత... త్వరలోనే మధుమేహరహిత భారతదేశాన్ని చూపి స్తాను అంటారు విశ్వాసంతో.
 
రోగులను అనారోగ్యాల బారి నుంచి కాపాడా లనుకునే వైద్యులు చాలామంది ఉంటారు. కానీ అసలు అనారోగ్యమన్నదాన్నే రూపుమాపాలని ఆలో చించే నందిత షా లాంటివాళ్లు ఎక్కడా కనిపించరు. ఆమె లక్షల్లో ఒకరు. లక్ష్యసాధనలో ఆమెకు సాటి రారెవ్వరూ!
 
- సమీర నేలపూడి
 
ఆరోగ్యానికి హాని కలగకూడదన్న ఉద్దేశంతో చక్కెర, నెయ్యి లాంటి కొన్ని పదార్థాలను వినియోగించవద్దని వైద్యులు అంటారు కదా! కానీ నందిత వాటిని వాడొద్దని చెప్పరు. అవి లేకుం డానూ వండరు. ప్రతి పదార్థం గురించీ ఆమెకు స్పష్టంగా తెలుసు. ఏది ఎంత తింటే ప్రమాదం ఉండదో అంత వరకే వినియోగించి వండుకోవడం ఎలానో నేర్పుతారామె. ఆమె వంటకాలకి డిమాండ్ బాగా పెరిగింది. విదేశాల నుంచి సైతం వచ్చి రకరకాల రెసిపీలు నేర్చుకుని వెళ్తుంటారు చాలామంది. ‘షారన్’ వెబ్‌సైట్ చూసి కూడా కొన్ని నేర్చుకోవచ్చు. ఇంకా తెలుసు కోవాలంటే నందిత నడిపే వర్‌‌కషాప్‌కి వెళ్లడమే. ఒక్క రోజులో బోలెడు నేర్పుతారామె.
 

మరిన్ని వార్తలు